చంద్రబాబు కత్తి పట్టి..దోమను కొట్టి: నీరు చెట్టులో ఇదీ అవినీతి : మేటర్ వీక్..పబ్లిసిటీ పీక్.
ఏపీ బడ్జెట్ పైన అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ సమాధానం ఇచ్చారు. అమ్మ ఒడి పధకం మీద టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని..ఆ పధకం తల్లులకు సంబంధించినదని వివరించారు. అదే విధంగా పింఛన్ల కోసం అధిక నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఇక, టీడీపీ హాయంలో రాజధాని కోసం చేసిన ఖర్చును బయట పెట్టారు. నీరు చెట్టు కింద అయిదేళ్ల కాలంలో బడ్జెట్లో రూ.793 కోట్లు కేటాయింపులు చేయగా.. వాస్తవంగా రూ 4,850 కోట్లు ఖర్చు చేయటం ద్వారా ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్దం చేసుకోవచ్చన్నారు. టీడీపీ హయాంలో మేటర్ వీక్..పబ్లిసిటీ పీక్ అంటూ ఎద్దేవా చేసారు.
Recommended Video
నీరు చెట్టులో వేల కోట్ల అవినీతి..ఇదే సాక్ష్యం..
బడ్జెట్ పైన చర్చకు సమాధానంగా బుగ్గన అనేక విషయాలను బయట పెట్టారు. తెదేపా హయాంలో నీరు-చెట్టు కార్యక్రమానికి రూ.793 కోట్లు కేటాయించి రూ.4,850 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు. నిధులను దోచుకున్నారని బుగ్గన ధ్వజమెత్తారు. పింఛన్లకు రూ.15,868 కోట్లు కేటాయించామన్నారు. బీసీ సంక్షేమానికి గత ప్రభుత్వం రూ.11వేల కోట్లు కేటాయించి రూ.6,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం బీసీ సంక్షేమానికి రూ.15,061 కోట్లు కేటాయించిదన్నారు. తెదేపా హయాంలో ఐటీ పరిశ్రమలు తీసుకొస్తుంటే తాము అడ్డుకుంటున్నామని ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టారని.. అసలు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి? అని బుగ్గన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం అమరావతిని భ్రమరావతి చేసిందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి ఐదేళ్లలో తెదేపా ప్రభుత్వం కేవలం రూ.277 కోట్లే కేటాయించిందన్నారు. తమ ప్రభుత్వం ఈ బడ్జెట్లోనే రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. అమరావతి నిర్మాణానికి తమ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇస్తుందని బుగ్గన చెప్పారు.
మేటర్ వీక్.. పబ్లిసిటీ పీక్
బుగ్గన తన సమాధానంలో పలుమార్లు వ్యంగాస్త్రాలు సంధించారు. వనం-మనం, నీరు-చెట్టు, దోమలపై దండయాత్ర, మీ ఇంటికి మీభూమి, హ్యాపీ సండే, జలహారతి పథకాలను ఉద్దేశిస్తూ ఆ పథకాలకు గత ప్రభుత్వ హయాంలో జరిపిన కేటాయింపులను బుగ్గన వివరించారు. టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఉద్యోగులను ఇబ్బంది పెడుతుంటే హ్యాపీ సండే ఎక్కడుందని ప్రశ్నించారు. దోమలపై దండయాత్ర అన్నారని.. ఏం చేశారో అర్థం కావట్లేదంటూ తెదేపా పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ పాలనలో దోమలపై దండయాత్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు ఐదురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ఫ్లెక్సీని ఉద్దేశిస్తూ బుగ్గన చేసిన వ్యంగ్య వ్యాఖ్యానాలు సభలో ఒక్కసారిగా నవ్వులు పూయించాయి. కర్నూలు టౌన్లో చంద్రబాబు బాహుబళి తరహాలో కత్తి పట్టి నిలబడితే..ఆ కత్తి ఒక దోమను చంపుతూ ఏర్పాటు చేసిన భారీ కటౌట్ గురించి బుగ్గన వివరించారు. తెదేపా పాలనలో ప్రచార ఆర్భాటం ఎక్కువని.. అందుకే ప్రజలు కూడా మేటర్ వీక్.. పబ్లిసిటీ పీక్ అంటుంటారని ఎద్దేవా చేశారు.
మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహిస్తుంది..
మద్యపాన నిషేధం పైన వస్తున్న విమర్శలకు మంత్రి సమాధానం ఇచ్చారు. తాము ఇచ్చిన హామీ మేరకు బెల్టు షాపు లను తొలిగించామని చెప్పారు. ఇక నుండి మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని స్పష్టం చేసారు. తమ ప్రభుత్వం పశువులు, గొర్రెలకు కూడా బీమా చేయిస్తున్నామని, ఈ ఏడాది నుంచే గొర్రెల బీమా అమలు చేస్తామని బుగ్గన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పథకాలు చూస్తే ఆశ్చర్యమేస్తోందన్నారు. పలు పథకాల్లో తెదేపా ప్రభుత్వం జరిపిన కేటాయింపులకు, ఖర్చుకు సంబంధం లేదన్నారు. తొలి బడ్జెట్లోనే తాము ఇచ్చిన 80 శాతం హామీలను అమలు చేసామని..మిగిలినవి పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇక, పన్నుల ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని మంత్రి బుగ్గన స్పష్టం చేసారు.