రాజధానిలో భూములు కొనుగోలు చేసింది ఎవరో తెలిపిన బుగ్గన...
రాజధాని నిర్మాణంపై టీడీపీ అధినేత రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడంతోపాటు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చంద్రబాబు ఫైర్ కావడంతో ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి నిర్మాణంపై త్వరలో నిజాలు బయటకు రాబోతున్నాయని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గర రాజేంద్రనాథ్ అన్నారు. రాజధానికి నిర్మాణానికి ముందే టీడీపీ నేతలు అమరావతిలో భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపణలు చేశారు. ఇక రాజధాని నిర్మాణంపై త్వరలో నిర్ణయం వస్తుందని ఆయన వెల్లడించారు.
రాజధానిపై రగడ
రాజధాని నిర్మాణంపై రగడ కొనసాగుతోంది. నిర్మాణాలపై అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష టీడీపీనేతల మధ్య రోజువారిగా ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నేడు రౌంట్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అధికార పార్టీ నేతలు ఆయనకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వ్యాఖ్యలతో పాటు అమరావతి నిర్మాణంపై జరిగిన లోసుగులు, అవినీతిని ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బట్టబయలు చేశారు. ఈనేపథ్యంలోనే రాజధానిలో భూములు కోనుగోలు చేసిన వారి వివరాలను ఆయన వెల్లడించారు.
రాజధానిలో భూములు కొనుగోలు చేసింది వీరే...
అమరావతిలో నేరుగా టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు సంస్థ అయిన హెరిటేజ్ సంస్థతోపాటు పరిటాల సునిత, పయ్యావుల కేశవ్, లింగమనేని రమేష్ , కంభంపాటి రామ్మోహన్ రావు, పత్తిపాటి పుల్లారావు కొమ్మల పాటి శ్రీధర్, మురళిమోహన్ గారి లాంటి వారు రాజధానిలో భూములు కొనుగోలు చేశారని వీరితోపాటు వారికి అనుకూలంగా ఉన్నవారు, కారు డ్రైవర్ల పేర్ల మీద కూడ భూములు కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా అమాయక రైతులను మోసం చేయడంతోపాటు, ఎస్సీలను మేనేజ్ చేసి భూములను కొనుగోలు చేసి, ఇన్సైడ్ ట్రేడింగ్ నిర్వహించారని ఆయన తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఇవన్ని త్వరలో బయటకు రాబోతున్నాయని ఆయన తెలిపారు.
రాజధానిని టీడీపీ ఎందుకు నోటిఫై చేయలేదు
నాలుగున్న సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టీడీపీ రాజధాని ప్రాంతాన్ని నోటిఫై చేయకుండా టీడీపీ పడుకున్నారా...? మీరు వదిలిపెట్టి పోయిన సమస్యలతోనే .. సతమతవుతుంటే... ఇప్పుడు అదనంగా రాజధాని నిర్మాణం చేపట్టాలా అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు అయిదు సంవత్సరాలు అధికారంలో ఉండి, టీడీపీ మంత్రులు కేంద్రంలో భాగస్యాములు అయి ఉండి కూడ రాజధాని నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. రాసేవాళ్లు ఉన్నారని అవినీతి గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణంలో అనేక అవకతవకలు జరిగాయాని రాజధాని ప్రాంతంలో బినామీ పేర్లతో, ప్రజలను మభ్యపెడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని ఆయన ఆరోపించారు.ఈ నేపథ్యంలోనే హైదారాబాద్ నుండి అమరావతికి రాత్రీ రాత్రికి హుటాహుటిన పరుగెత్తి రావడం వల్ల ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కోన్నారని ఆయన అన్నారు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రం మొత్తం బలి అయిందని ఆయన ఆరోపించారు. జూన్లో ప్రభుత్వం ఏర్పటైన తర్వాత ఇన్సైడర్ పేరుతో అనేక అక్రమాలకు తెర తీశారని ఆయన ఆరోపణలు చేశారు.
రాజధాని నిర్మాణానికి 1500 ఎకరాలు చాలు
అసలు రాజధాని నిర్మాణం కోసం కేవలం 1500 ఎకరాలు ఉంటే సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. పరిపాలనకు సంబంధించిన భవనాలు నిర్మాణాలు చేయాడానికి 500 ఎకరాల నుండి 2000 ఎకరాలు మాత్రమే సరిపోతాయని ఆయన వివరించారు. క్యాన్సర్ వ్యాధితో ఇబ్బందిపడుతూ.. రాజధాని నిర్మాణం కోసం నియమించిన శివరామ క్రిష్ణణ్ కమిటీ నివేదికను కనీసం అసెంబ్లీలో కూడ ప్రవేశపెట్టలేదని ఆయన ఈ సంధర్భంగా గుర్తు చేశారు. వారికి అనుకూలంగా లేదనే ఆయన నివేదికను బహిర్గతం చేయలేదని అన్నారు.