త్వరలో ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభం..? భోగాపురం పనులు స్టార్ట్.., కేంద్రమంత్రితో బుగ్గన భేటీ..
భోగాపురం ఎయిర్పోర్టులు పనులు సత్వరమే ప్రారంభించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర విమానయాన మంత్రి హార్ధిప్సింగ్ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి కలిశారు. విశాఖ నావెల్ ఎయిర్పోర్టు విధివిధానాలపై కూడా చర్చించామని బుగ్గన మీడియాతో తెలిపారు. వచ్చే నెలలో కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభిస్తామని చెప్పారు. దీని నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని తెలిపారు.
వీటికి సంబంధంచి కేంద్ర ప్రభుత్వం నుంచి లైసెన్స్ ఫీజు/ ఇతర అంశాలకు సంబంధించి మినహాయింపులు కోరామని మంత్రి బుగ్గన వెల్లడించారు. ఏపీలో నూతన జాతీయ రహదారుల అంశంపై త్వరలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తానని మంత్రి తెలిపారు. గత కొన్ని రోజులుగా ఏపీలో కురిసిన భారీ వర్షాలు, వరదలపై రెవెన్యూశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేస్తోన్న సంగతి తెలిసిందే.
భారీ వర్షాలతో ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని.. తక్షణమే రూ.2250 కోట్ల ఆర్థికసాయం చేయాలని హోం మంత్రి అమిత్ షాకు సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని కూడా ఏపీకి పంపాలని లేఖలో జగన్ కోరారు. వివిధ శాఖల ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4450 కోట్ల నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొన్నారు.