జనవరి జీతాల టెన్షన్ - ఆర్దిక శాఖ తాజా ఉత్తర్వులతో: ప్రాసెస్ అయ్యేనా..!!
ఏపీలో పీఆర్సీ వివాదం..ఉద్యోగులు నిరసనలు.. ప్రభుత్వం వరుస ఉత్తర్వుల నడుమ జనవరి జీతం పైన సందిగ్ధత కొనసాగుతోంది. తమకు కొత్త పీఆర్సీ వద్దని.. పాత పీఆర్సీ మేరకు ఈ నెల జీతాలు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగులు..ప్రభుత్వంతో చర్చలకు రావాలంటే ముందుగా కొత్త పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని షరతు పెడుతున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం కొత్త పీఆర్సీ నిర్ణయం మేరకే జీతాల బిల్లులు సిద్దం చేయాలంటూ ట్రెజరీలతో పాటుగా పే అండ్ అకౌంట్స్ కార్యాలయకు వరుస సర్య్యులర్లు జారీ చేస్తోంది.
జనవరి జీతాల పై ఏం జరుగుతోంది
దీంతో..అసలు జనవరి జీతం విషయంలో ఏం జరుగుతోందనే టెన్షన్ కొనసాగుతోంది. తాజాగా, ఏపీ ఆర్దిక శాఖ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పింఛన్లను ఫిబ్రవరిలో చెల్లించాలని, అందుకు అనుగుణంగానే వీటికి సంబంధించిన బిల్లులను రూపొందించాలని ఆర్థిక శాఖ మరోసారి స్పష్టం చేసింది. వాస్తవానికి జనవరి నెల నుంచి ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. కొత్త జీతాలు వస్తే ఈ వాస్తవం బయటపడుతుందన్న కారణంతోనే కొందరు కొత్త జీవోల ప్రకారం జీతాలు విడుదల కా కుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారనేది ప్రభుత్వ ముఖ్యుల అభిప్రాయంగా తెలుస్తోంది.
కొత్త వేతాలనే అంటున్న ప్రభుత్వం
ఈ నేపథ్యంలోనే ఆర్థికశాఖ తాజా ఉత్తర్వులు జారీచేసింది. నిర్దేశించిన సమయంలోగా బిల్లులను ప్రాసెస్ చేయాలని, ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు సచివాలయ శాఖలు, శాఖాధిపతులు, ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాలకు ఆర్థిక శాఖ సర్క్యులర్ మెమో జారీ చేసింది. జీవోలకు విరుద్ధంగా వ్యవహరించడానికి వీల్లేదని, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. అయితే, ఒక సారి కొత్త వేతనాల మేరకు బిల్లులు పాసయి... ఉద్యోగుల ఖాతాల్లో జమ అయితే అయితే పెరిగిన వేతన తేడాలు ఉద్యోగులకు అర్దం అవుతుందని.. వాస్తవాలు తెలుస్తాయంటూ ప్రభుత్వంలోని ముఖ్యలు చెబుతున్నారు.
పాతవే కావాలంటున్న ఉద్యోగ సంఘాలు
సాంకేతిక అంశాలు ఏ విధంగా ఉన్నా.. గతం కంటే గ్రాస్ శాలరీలో మొత్తంలో పెరుగుదల కనిపిస్తోందని.. ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నట్లుగా తగ్గుదల అనేది లేదనే విషయం స్పష్టం అవుతుందనేది వారి అంచనా గా కనిపిస్తోంది. కానీ, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం కొత్త జీతాలు వద్దంటూ ఆందోళన చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రెజరీ ఉద్యోగుల పైన ఒత్తిడి పెరుగుతోంది. జీతాల సవరణలో భాగంగా ప్రతీ ఉద్యోగి సర్వీసు రిజిస్టర్ పరిశీలించి వారి వేతనాలు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.
Recommended Video
సర్క్యులర్ జారీ.. కొత్త వేతనాలు ఇవ్వాలంటూ
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటల సమయానికి ఖజానా శాఖ ఉద్యోగులందరి జీతాల బిల్లులను కొత్త పీఆర్సీకి అనుగుణంగా అక్కడి డీడీవోలు సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారని ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. దీంతో..ఉద్యోగులకు ఫిబ్రవరి 1న అందాల్సిన జీతాలు సకాలంలో అందుతాయా.. కొత్త పీఆర్సీ ప్రకారం విడుదల చేస్తారా.. లేక, ఉద్యోగ సంఘాల డిమాండ్ మేరకు పాత వేతనాలనే ఈ నెల సైతం కొనసాగిస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.