డబ్బుల్లేవ్, ఎవరూ అడగొద్దు: యనమల, ఉద్యోగుల జీతానికి ఇబ్బంది ఉండదు
హైదరాబాద్: రాష్ట్ర ఖజానాలో నిధులు లేవని, అదనపు బడ్జెట్ ఎవరూ అడగవద్దని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం నాడు అన్నారు. ఖజానాలో వేతనాలకు, సంక్షేమ పథకాల అమలుకు తగినంత నిధులు లేవని చెప్పారు.
సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన యనమల సమీక్ష నిర్వహించారు. 2015-16 సంవత్సరంలో రూ.7 వేల కోట్ల ఆదాయ లోటు ఉందని ఈ సందర్భంగా వెల్లడించారు. అన్ని మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు.
ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు లేఖలు రాసినట్లు చెప్పారు. బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే, ఇప్పటికే రూ.10 వేల కోట్లను అదనంగా ఖర్చు పెట్టేశామన్నారు. లెవీ విధానాన్ని తొలగించడంతో ఏపీకి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు.
పరిస్థితిని సమీక్షించి, ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా లోటును పూడ్చుకోవాలని సూచించారు. అదనపు బడ్జెట్ అడగవద్దన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు విధానాన్ని మార్చడం తీవ్ర ప్రభావం చూపిందని చెప్పారు. ఖజానా పైన రూ.10వేల కోట్ల అదనపు భారం పడిందన్నారు.
ఏడువేల కోట్ల లోటు కనిపిస్తోందన్నారు. ఎక్సైజ్, కమర్షియల్ నుంచి ఆశించిన వృద్ధి కనిపించలేదని చెప్పారు. ఉద్యోగుల స్పెషల్ అలవెన్సుల పైన వారంలోగా నిర్ణయిస్తామని చెప్పారు. ఉద్యోగుల జీతానికి ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని చెప్పారు.