మంత్రులకు జగన్ హెచ్చరికలు: పదవులు రద్దు: 27 శాతం ఐఆర్.. సీపీఎస్ రద్దు..ఆర్టీసి విలీనానికి
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సచివాల యంలో దాదాపు ఆరు గంటల పాటు జరిగిన కేబినెట్లో అనేక వర్గాలకు వరాలు ప్రకటించారు. మంత్రులకు కొన్ని హెచ్చరికలు జారీ చేసారు. టీడీపీ ప్రభుత్వంలో నియమించిన నామినేటెడ్ పదవులకు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదే విధంగా సీపీఎస్ రద్దు..ఆర్టీసి విలీనం కోసం కమిటీలను ఏర్పాటు చేస్తూ నిర్ణయించారు. మేనిఫెస్టో ఆధారంగానే పాలన సాగుతుందని జగన్ స్పష్టం చేసారు.
కేటినెట్లో కీలక నిర్ణయాలు...
ఏపీలో పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన తొలి కేబినెట్ సుదీర్ఘంగా సాగింది. అనేక కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. పాదయాత్ర..మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏపీలోని ఉద్యోగులు..పెన్షనర్లకు 27 శాతం మధ్యంతర భృతిని జూలై నుండి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీని కారణంగా ప్రతీ నెలా 900 కోట్లు అదనపు భారం పడుతుందని తేల్చారు. అదే విధంగా సామాజిక పెన్షన్ల వయసును 65 నుండి 60 ఏళ్లకు తగ్గిస్తూ పెన్షన్ను 2000 నుండి 2250కు పెంచుతూ నిర్ణయించారు. ప్రతీ ఏటా ఆరు లక్షల ఇళ్లు లక్ష్యంగా పని చేయాలని నిర్ణయించారు. మున్సిపల్..పారిశుద్ద కార్మికుల వేతనాలను 18 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఆశా వర్కర్ల జీతాలు రూ.3వేలు నుంచి రూ.10వేలకు పెంపుతో పాటు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ పెంపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 15 నుండి వైయస్సార్ భరోసా అమలుకు కేబినెట్లో ఆమోదముద్ర వేసారు.
సీపీఎస్..ఆర్టీసీ విలీనం కోసం కమిటీలు
ఉద్యోగులు ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేయటం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ సమస్యను ఏపీలో ఇప్పుడు పరిష్కరించాలంటే ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయో చర్చించి పరిష్కార మార్గాలు చూపించనున్నారు. ఇక, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్దికంగా.. సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులను గుర్తించి..వాటి పరిష్కారాలను సూచించాలని సీఎం ఆదేశించారు. దీని కోసం మూడు నెలల కాల పరిమితిని నిర్ణయించారు. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల జీతం పెంపుతో పాటుగా జూన్ 26 నుండి అమ్మ ఒడి అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటుగా ప్రయివేటు విద్యా సంస్థల్లో చదివే పిల్లల తల్లులకు నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.
మంత్రులకు చురకలు...పదవులు రద్దు
తొలి కేబినెట్ సమావేశంలోనే ముఖ్యమంత్రి జగన్ మంత్రులకు చురకలు వేసారు. ఒక రకంగా హెచ్చిరకలు జారీ చేసా రు. ఏ శాఖలో అవినీతి జరిగినా సంబంధిత మంత్రి బాధ్యత వహించాలని స్పష్టం చేసారు. బంధువలు.. స్నేహితులు ఎవరూ మంత్రుల పేర్లు చెప్పి అవినీతికి పాల్పడకుండా చూసుకోవాలని సూచించారు. అవినీతి అనేది జరిగితే ఎక్కడా సహించేది లేదని తేల్చి చెప్పారు. ఇక, అధికారులు ఖచ్చితంగా మంత్రుల ఆదేశాల మేరకే నడుచుకోవాలని.. మంత్రు లకు తెలియకుండా ఏ నిర్ణయం తీసుకోవటానికి వీళ్లేదని స్పష్టం చేసారు. అదే విధంగా గత ప్రభుత్వంలో నియమితు లై ఇంకా కొనసాగుతున్న నామినేటెడ్ పదవులను రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. ఆ వెంటనే నామినేటెడ్ పోస్టు లను భర్తీ చేస్తామని ప్రకటించారు.