EODBలో ఏపీకి ఫస్ట్ ప్లేస్ మా ఘనతే, బాబు కృషి వల్లేనంటోన్న లోకేశ్..
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్లే.. EODBలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 2018- 2019లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీకి మొదటి ర్యాంకు రావటం అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కృషికి నిదర్శనం అని లోకేశ్ పేర్కొన్నారు.
ఇలా సాధ్యం..
వ్యాపార సంస్కరణల కార్యాచరణను సమర్ధవంతంగా అమలు చేయడం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచి మళ్లీ మొదటి ర్యాంక్ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలు ముఖ్యమంత్రి జగన్ కొనసాగించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ పారిశ్రామిక విధానాన్ని బ్రష్టు పట్టించారని విమర్శించారు.
అగ్రస్థానంలో ఏపీ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019 విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రెండో ర్యాంకు ఉత్తర్ ప్రదేశ్కు దక్కగా మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ర్యాంకింగ్స్ను న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌరవిమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీలు విడుదల చేశారు.
ర్యాంకింగ్ ఇలా ఇచ్చారు..
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వాణిజ్య సంస్కరణ కార్యాచరణ ప్రణాళిక ఆధారంగా ఇవ్వడం జరిగిందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. సింగిల్ విండో వ్యవస్థ ద్వారా , కార్మిక చట్టాల్లో సంస్కరణలు, వివాదాల చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడం ద్వారా వ్యాపార నియంత్రణను క్రమబద్ధీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
Recommended Video
కీ రోల్
కరోనావైరస్తో ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయని చెప్పిన పీయూష్ గోయల్... భారత్ తిరిగి కోలుకునేందుకు ఎంతో సమయం పట్టదని అన్నారు. ఇందుకు కారణం ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన ఆత్మనిర్భర్ భారత్ అని వెల్లడించారు. ఇక ప్రపంచ దేశాల్లో వాణిజ్య పరంగా భారత్ కీలక పాత్ర పోషించనుందని జోస్యం చెప్పారు.