పాకిస్తాన్ నిర్ణయంతో.. ఏపీలోని ఆ 20 కుటుంబాలకు ముందే సంక్రాంతి.. సీఎం జగన్కు థ్యాంక్స్
ఏపీ నుంచి పొట్టచేతబట్టుకుని గుజరాత్ కు వెళ్లి.. చేపల వేట బోటులో పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించి.. 14 నెలల పాటు కరాచీ జైలులో నరకం చూసిన ఆంద్రా జాలర్లు ఎట్టకేలకు సొంత దేశానికి చేరుకున్నారు. సోమవారం వాఘా సరిహద్దు దగ్గర పాకిస్తాన్ అధికారులు.. 20 మంది జాలర్లను బీఎస్ఎఫ్ అధికారులకు అప్పగించారు. ఇందుకోసమే ప్రత్యేకంగా వెళ్లిన ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జాలర్లకు స్వాగతం పలికారు.
హెల్త్ చెకప్.. ఇంకొన్ని ప్రశ్నలు..
14 నెలలపాటు పాక్ జైలులో ఉన్నమత్స్యకారులు ఇవాళే భారత్ లోకి అడుగుపెట్టారు. వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొనడంతో అధికారులు హెల్త్ టెస్టులు నిర్వహించారు. పాక్ జైలు జీవితం, అక్కడి పరిస్థితులపై ఇంటెలిజెన్స్ అధికారులు.. మత్స్యకారుల్ని ఆరా తీసినట్లు సమాచారం. పరీక్షలు పూర్తైన వెంటనే ఆ 20 మందినీ ముందుగా ఢిల్లీకి, అక్కణ్నుంచి స్వస్థలమైన శ్రీకాకుళం జిల్లాకు తీసుకురానున్నారు.
పాదయాత్రలో చేసిన ప్రామిస్..
గుజరాత్ వలస వెళ్ళిన ఆంధ్రా జాలర్లు 2018 డిసెంబర్లో పాక్ నేవీ చేతికి చిక్కారు. శ్రీకాకుళంలో ఉంటోన్న వారి కుటుంబాలు ఆందోళనకు గురయ్యారు. ఎన్నికలకు ముందు జిల్లాలో జగన్ పాదయాత్ర చేసిన సందర్భంలో.. స్థానిక వైసీపీ నాయకులు ఈ అంశాన్ని అధినేతకు చేరవేశారు. జాలర్ల విడుదలకు ప్రయత్నిస్తానని ఆ కుటుంబాలకు ప్రామిస్ చేసిన జగన్.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ ద్వారా విదేశాంగ శాఖను సంప్రదించడం, వరుస సంప్రదింపుల తర్వాత జాలర్ల విడుదలకు పాక్ అంగీకరించడంతో కథ సుఖాంతమైంది.
ముందే పండుగ..
పాక్ చెరలోని తమవాళ్లు విడుదలై ఇంటికి వస్తుండటంతో ఆ 20కుటుంబాల్లో సందడి వాతావరణం నెలకొంది. సంక్రాంతి పడుగ ముందే వచ్చినట్లుందని ఆ కుటుంబీకులు సంబరపడిపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి మోపిదేవి వాఘా బోర్డర్ లో మీడియాతో మాట్లాడుతూ.. పాక్ జైలు నుంచి విడుదలైన జాలర్లకు ఇది నిజంగా మరో జన్మ లాంటిదని, వైసీపీ ఎంపీల పట్టుదలతోనే ఇది సాధ్యమైందని చెప్పారు.