ఎపిలో కొత్తగా...150 మున్సిపాలిటీలు:పురపాలికలుగా మేజర్ పంచాయితీలు
కృష్ణా జిల్లా: రాష్ట్రంలో కొత్తగా 150 మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయని ఎపి మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ వెల్లడించారు. మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నందున మేజర్ పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు.
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో శనివారం ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, ఎమ్మెల్సీ తొండపు దశరథ జనార్దన్, మాజీ మంత్రి నెట్టెం రఘురాంతో కలసి పలు అభివృద్ధి పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
మార్చి నెలాఖరుకు నూతన రాజధాని అమరావతి ఆకృతులను ఖరారు చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. ఎపి న్యూ క్యాపిటల్ అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రకటన ఇచ్చామని, కొన్ని నెలల్లో ఆ పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. అమరావతి పరిధిలో 1600 కిలోమీటర్ల మేర కొత్త రహదారి నిర్మాణం జరుగుతోందని చెప్పారు.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 32 లక్షల ఇళ్లు మంజూరుచేస్తే, ఆంధ్రప్రదేశ్కు 6.38 లక్షల ఇళ్లు దక్కాయన్నారు. వీటి నిర్మాణానికి రూ.38వేల కోట్లు వెచ్చించనున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది నాటికి రాజధానిలో పనిచేసే 3500 మంది ఉద్యోగులకు ఇళ్లు నిర్మించి వారికి అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు.