ఐటీ వలలో చంద్రబాబు మాజీ పీఏ శ్రీనివాస్.. హైదరాబాద్ విజయవాడ ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పలువురు ప్రముఖల ఇళ్లపై ఐటీ దాడులు చేస్తోంది. ఇందులో ముఖ్యంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఏగా వ్యవహరించిన శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర విభజన తర్వాత 2014లో సీఎం అయ్యాక కూడా శ్రీనివాస్ పీఏగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబుకు శ్రీనివాస్ వీరవిధేయుడిగా తెలుస్తోంది.
శ్రీనివాస్ సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లో ఉద్యోగి. ఆయన ప్రకాశం జిల్లాకు చెందినవాడు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పీఏగా వ్యవహరించిన శ్రీనివాస్ భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు ఐటీశాఖకు అందాయి. ఫిర్యాదు అందుకున్న ఐటీశాఖ హైదరాబాద్, విజయవాడల్లో ఉన్న ఆయన నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది.
గతంలో చంద్రబాబు కార్యాలయంలో పనిచేసిన అధికారులకు ప్రస్తుత ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వలేదు. ఒక్క సతీష్ చంద్రకు మాత్రమే పోస్టింగ్ ఇచ్చింది. మిగతా ఐఏఎస్ ఇతర ఉన్నతాధికారులను పోస్టింగులు ఇవ్వకుండా ఇంకా వెయిటింగ్లో ఉంచింది. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారులైన సాయిప్రసాద్, రాజమౌళిలకు ఇంకా పోస్టింగులు దక్కలేదు. ప్రస్తుతం చంద్రబాబు వద్ద పీఏగా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిపై ఐటీ దాడులు జరగడం ఇటు టీడీపీ వర్గాల్లో అటు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమైంది.