కేవీపీ రాజకీయ అడుగులు అటేనా : జగన్ ఆలోచన ఏంటి: ఏపీలో మరోసారి కీలక భూమిక..!
వైయస్సార్ ఆత్మ రాజకీయ అడుగులు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. వైయస్ కు కాలేజి రోజుల నుండి ప్రాణ స్నేహితుడుగా ఉండటమే కాకుండా..రాజకీయంగానూ కుడిభుజంగా వ్యవహరించారు. ఇక, వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతీ నిర్ణయంలోనూ కీలకంగా నిలిచారు. పాలనా వ్యవహారాలకు వైయస్సార్ ప్రాధాన్యత ఇవ్వగా..రాజకీయ వ్యవహారాలను తెర వెనుక కేవీపీ చూసుకొనే వారు.
ఇక, అనేక నిర్ణయాల్లో కేవీపీని కలిసి తన వద్దకు రావాలని వైయస్సార్ సూచించిన సందర్భాలు ఉన్నాయి. అటువంటి కేవీపీకి వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాజ్యసభ సీటు ఇప్పించారు. అప్పటి నుండి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన కేవీపీ...వచ్చే ఏప్రిల్ 9వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్ ఆయనకు రాజ్యసభకు రెన్యూవల్ చేయలేదు. దీంతో..ఇప్పుడు కేవీపీ ఏం చేస్తారు..కాంగ్రెస్ లో పదవులు లేకుండానే కొనసాగుతారా..లేక తన స్నేహితుడి కుమారుడికి దగ్గరవుతారా..జగన్ కు అండగా నిలుస్తారా.. వైసీపీ లో ఏం జరుగుతోంది...
వైయస్సార్ కుటుంబానికి అత్యంత ఆప్తుడుగా..
కేవీపీ రామచంద్రరావు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు. ఆయన పదవీ కాలం ముగిసింది. వైయస్ తో కలిసి యువజన కాంగ్రెస్ తో మొదలైన రాజకీయ ప్రస్థానం వైయస్సార్ తో కలిసి ఉన్న సమయంలోనూ..ఇప్పుడు కాంగ్రెస్ తోనే ఉన్నారు. వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వంలో..పార్టీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించారు. ఇక, వైయస్సార్ మరణం తరువాత..ఆయన కుటుంబానికి తోడుగా నిలిచారు. జగన్ పావురాల గుట్ట వద్ద తన తండ్రి మరణం తట్టుకోలేక మరణించిన కుటంబాలను ఓదారుస్తానని ప్రకటించిన సమయంలో..ఓదార్పు యాత్రం ప్రారంభ సమయంలోనూ మద్దతుగా నిలిచారు.
ఓర్పుతో ఉండాలని సూచించిన కేవీపీ
నాడు కాంగ్రెస్ పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలతో జగన్ విభేదిస్తూ వచ్చారు. పార్టీ వీడాలనే తన ఆలోచనలను కేవీపీతోనూ పంచుకున్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ..వైయస్సార్ ఆశయ సాధన కోసం పని చేయాలని.. ఓర్పుతో ఉండాలని కేవీపీ సూచించారు. అయినా..జగన్ ససేమిరా అంటూ..పార్టీ వీడారు. అప్పటి నుండి జగన్..కేవీపీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. జగన్ పైన కేసులు పెట్టి..జైలు శిక్ష విధించిన సమయంలోనూ కేవీపీ జోక్యం చేసుకోలేదు. తాను వైయస్సార్ లక్ష్యమైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయటం కోసం పని చేస్తానని కేవీపీ చెప్పేవారు.
రెన్యువల్ కాని రాజ్యసభ సభ్యత్వం..
వైయస్సార్ హయాం నుండి నేటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేవీపీకి..తిరిగి కాంగ్రెస్ రెన్యువల్ చేయలేదు. మధ్యప్రదేశ్ నుండి కేవీపీకి రాజ్యసభ దక్కుతుందని భావించారు. అయితే, అక్కడ జ్యోతిరాదిత్య సింధియా పార్టీ ఫిరాయింపుతో అక్కడ పరిస్థితి తారుమారు అయింది. దీంతో..ఇప్పుడు కేవీపీ మరి పదవి లేకపోయినా కాంగ్రెస్ లోనే కొనాసాగుతారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. అటు తెలంగాణ ప్రభుత్వంతోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నా..అక్కడ రాజకీయంగా అవకాశం లేదు. జగన్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార కార్యక్రమానికి హాజరైన కేవీపీ ఆ తరువాత మాత్రం ముఖ్యమంత్రిని కలవ లేదు. రాష్ట్రంలో కేంద్రం నుండి సాధించుకోవాల్సిన అంశాల పైన మాత్రం సీఎంకు లేఖలు రాశారు. ఇక, ఇప్పుడు ఆయన తన అల్లుడుగా భావించే జగన్ వద్దకు చేర్చేందుకు నాటి మిత్రులు ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
జగన్ ఆలోచన ఏంటి...
అయితే, తాను కాంగ్రెస్ వీడినా..కేవీపీ కాంగ్రెస్ లోనే కొనసాగటం పైన కేవీపీ గురించి జగన్ ఏరోజు వ్యతిరేకంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ నేతగా ఉన్నా..కేవీపీ సైతం జగన్ పైన విమర్శలు చేయలేదు. అయితే, వైయస్సార్ ను దూషించిన ఎంతో మంది ఇప్పుడు జగన్ కు దగ్గరయ్యారు. ఆయన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారని..వైయస్సార్ కు కష్ట సుఖాల్లో తోడుగా నిలిచిన కేవీపీ..కాంగ్రెస్ ను వీడి వైసీపీలోకి వస్తే జగన్ కాదనే పరిస్థితి లేదని పార్టీలో ముఖ్యులు చెబుతున్న విషయం. స్థానిక సంస్థల ఎన్నికలు..బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ఈ విషయం పైన అటు కేవీపీ..జగన్ ఏ రకంగా ముందడుగు వేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఇద్దరు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా కేవీపీని తిరిగి జగన్ కు దగ్గర చేయగలిగితే..ఏపీ ప్రభుత్వ పరంగా కీలక భూమిక పోషించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి ఏప్రిల్ తొలి వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.