బీజేపీలో చేరిన మాజీ సిఎస్ ఐవైఆర్ కృష్ణారావు:అమిత్ షా సమక్షంలో పార్టీలో జాయిన్
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ మాజీ ఛీప్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు అనూహ్యమైన రాజకీయ నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐవైఆర్ వైసిపి లో చేరడం ఖాయమనుకుంటున్న పలువురి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన బిజెపిలో చేరారు.
తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బిజెపి పుచ్చుకున్నారు. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో బస చేసిన అమిత్ షా ను ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలసి వెళ్లి కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఐవైఆర్ కృష్ణారావుకు బిజెపి కండువా కప్పిన అమిత్ షా ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానం పలికారు.
చంద్రబాబుకు అరెస్ట్ వారెంట్లు కాక ఇంకేమొస్తాయ్!, 25సార్లు సమన్లు..: బాబ్లీ కేసుపై అమిత్ షా
కొంతకాలం కిందట ఐవైఆర్ వైసీపీలో చేరనున్నట్లు విసృతంగా ప్రచారం జరిగింది. ఇటీవలే జగన్ పాదయాత్రలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఐవైఆర్ మరి కొన్ని పోకడలు చూసినవారంతా ఆయన వైసీపీలో చేరడం ఖాయమనుకున్నారు. అయితే వారందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఆయన బీజేపీలో చేరారు.
మరోవైపు మాజీ సిఎస్ ఐవైఆర్ తమ పార్టీలో చేరడంపై ఏపీ కమలనాథులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐవైఆర్లాంటి మేధావులు బీజేపీకి ఎంతో అవసరమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన అనంతరం బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ పదవి చేపట్టాక, తదనంతర పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఐవైఆర్ కృష్ణారావుకు మథ్య విభేదాలు తలెత్తాయి.
ఈ క్రమంలో ఆయన వైసీపీకి దగ్గరవుతున్నట్లే కనిపించారు...అలాగే ప్రవర్తించారు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో కానీ అనూహ్యంగా బీజేపీలో చేరారు.ఐవైఆర్ చేరికకు ముందు మహబూబ్ నగర్ సభలో మాట్లాడిన అమిత్ షా...టిఆర్ ఎస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. మే నెలలో ఎన్నికలు వస్తే ఓడిపోతామని టీఆర్ఎస్ భయపడిందా...లోక్ సభతో కలిసి ఎన్నికలొస్తే ఓడిపోతామని వీరు ఆందోళన చెందారా అని ప్రశ్నించారు. మరి మే నెలలో గెలవనివారు...నవంబర్, డిసెంబర్ లో మాత్రం ఎలా గెలుస్తారని అమిత్ షా టిఆర్ఎస్ నుఎద్దేవా చేశారు.