జగన్ పై ఐవైఆర్ కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు-మైలేజ్ కే లక్షల పంపకాలు-5 లక్షల కోట్ల అప్పు
ఏపీలో వైసీపీ సర్కార్ చేస్తున్న రుణాలపై ఇప్పటికే టీడీపీ, బీజేపీతో పాటు జనసేన పార్టీ కూడా రచ్చ చేస్తోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని చెబుతోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు విపక్షాలకు మంంచి అవకాశం దొరికింది. దీంతో విపక్షాలు నిత్యం ప్రభుత్వ రుణాల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో బీజీపీ నేత, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ఇవాళ జగన్ సర్కార్ పై విమర్శలకు దిగారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోందని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. .వ్యక్తిగత ఇమేజ్ కోసం లక్షల కోట్ల రూపాయలు పంచుతూ పోతే పంచడానికి మిగలదంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు,జగన్ చేసిన అప్పులు 5 లక్షల కోట్లకు చేరాయని ఐవైఆర్ కృష్ణారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అందకునే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు. బడ్జెట్ మొత్తం తాయిలాలకు సరి పోతుంటే మౌలిక సదుపాయాల మాటేమిటి అని ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు.
రోడ్ల దుస్థితి, ఆస్పత్రుల్లో కుట్లు వేయడానికి దారం కూడా లేని పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతుందని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. రాష్ట్ర బడ్జెట్లో పెన్షన్లు జీతాల అప్పుల పై వడ్డీలు చెల్లించేందుకు 35% సరిపోతుందని, భవిష్యత్తులో నెల నెల జీతాలు చెల్లించడం కూడా కష్టమేనని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, స్టీల్ అప్పు గా ఇవ్వాలని అడుగుతున్న అధికారులు, ఇకపై తమ నెలవారీ సరుకులు కూడా అప్పుగా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. చెప్పినవన్నీ చేయడానికి ప్రభుత్వం దగ్గర మంత్రదండం గాని అల్లావుద్దీన్ అద్భుతదీపం గాని లేవని గ్రహించాలని ఐవైఆర్ కృష్ణారావు కోరారు.
సంక్షేమ పథకాలకు ఖర్చు చేయటం తప్పు కాదని, కానీ.కేంద్రం ప్రభుత్వ తరహాలో బడ్జెట్లో 10 శాతానికి మించకుండా పథకాలకు ఖర్చు చేయవచ్చని ఐవైఆర్ కృష్ణారావు జగన్ సర్కార్ కు సూచించారు. రాష్ట్రంలో ఉన్న దారుణ ఆర్థిక పరిస్థితి ప్రజలు గమనించి ఆలోచించాల్సిన అవసరం ఉందని ఐవైఆర్ తెలిపారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రం కోలుకోలేని విధంగా నష్టపోతుందని ఐవైఆర్ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.