సీఎస్ బాధ్యతల నుంచి ఎల్వీ సుబ్రహ్మణ్యం రిలీవ్...నీరబ్ ప్రసాద్కు సీఎస్ బాధ్యతలు అప్పగింత
అమరావతి:ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన స్థానంలో తాత్కాలిక సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ను ప్రభుత్వం నియమించింది. ఇక చీఫ్ సెక్రటరీగా 1984వ బ్యాచ్కు చెందిన నీలం సహానీ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే నీలం సహానీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను కలిశారు. ఇక కేంద్రం నుంచి ఆమోదం రాగానే ఆమె ఆంధ్రప్రదేశ్ సీఎస్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుండి ఎల్వీ సుబ్రహ్మణ్యం రిలీవ్ అయ్యారు. ప్రభుత్వం ఆకస్మిక బదిలీ చేయడంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం సీసీఎల్ఏ బాధ్యతలు నిర్వహిస్తున్న నీరబ్కుమార్కు సీఎస్ బాధ్యతలను అప్పగించారు. ఇక మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం పదవీ విరమణకు ఇంకా ఆరునెలల సమయం ఉంది.
సుబ్రహ్మణ్యం సర్వీసు వచ్చే ఏప్రిల్ నెలాఖరువరకు ఉంది. ఈ ఆరునెలల పాటు ఆయన విధుల్లో కొనసాగుతారా లేదా అనేది చాలా మందిలో అనుమానం రేకెత్తిస్తోంది. అదే సమయంలో స్వచ్చంద పదవీ విరమణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఏపీ సీఎస్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించిన ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఒక్కసారిగా మరో శాఖకు బదిలీ చేయడంపై ఆయన హోదాను తగ్గించారనే భావనలో సుబ్రహ్మణ్యం ఉన్నట్లు సమాచారం.
ఇక మనస్తాపానికి గురైన ఎల్వీ సుబ్రహ్మణ్యం తను ప్రస్తుతం బదిలీ అయిన శాఖలో బాధ్యతలు చేపట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్టాపిక్గా మారింది. ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేదానిపై చాలా మంది ఆసక్తితో చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీ సీఎస్గా మహిళ ఉండాలనే ధృఢ నిశ్చయానికి సీఎం జగన్ రావడంతో ఆమెను సీఎస్గా అపాయింట్ చేయాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం ఆమె కేంద్ర సర్వీసుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్రం రిలీవ్ చేసిన వెంటనే ఆమె ఏపీ సీఎస్గా బాధ్యతలు చేపడతారు.