హైకోర్టు వరమిచ్చినా జగన్ కరుణించలేదు- సుప్రీం ఆదేశాల కోసం నిమ్మగడ్డ ఎదురుచూపులు...
ఏపీలో కరోనా కారణంగా స్ధానిక సంస్ధల ఎన్నికలను ఏ క్షణాన వాయిదా వేశారో తెలియదు కానీ అప్పటి నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అప్పటివరకూ ప్రభుత్వ వర్గాలకే పరిచయమైన ఆయన పేరు స్ధానిక ఎన్నికల వాయిదా తర్వాత రాష్ట్రమంతటికీ సుపరిచితమైపోయింది. ఈ వివాదాలు ఆయనకు మేలు చేశాయా నష్టం చేశాయా అన్న విషయాన్ని పక్కనబెడితే అంతిమంగా ఆయన కోరుకున్న పదవి మాత్రం ఆయనకు అందని ద్రాక్షే అవుతోంది. తాజాగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో అత్యున్నత న్యాయస్ధానం ఆదేశాల కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.
భారత్లో భీకరంగా కరోనా విస్తరణ: సరిగ్గా 7 నెలల్లో: రోజూ 2.87 లక్షల పాజిటివ్ కేసులు నమోదు
జగన్ ఆగ్రహంతో మొదలు...
రాజ్యాంగ పదవుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాధినేతల ఆగ్రహానికి గురయితే పరిస్దితి ఎలా ఉంటుందో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను అడిగితే సరిపోతుంది. నిబంధనల ప్రకారం తనకున్న అధికారాలను వినియోగించుకుని నిమ్మగడ్డ తీసుకున్న ఒక్క నిర్ణయం ఆయనకు ఇప్పటికీ కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. కరోనా కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా వేయాలన్న నిర్ణయం అప్పట్లో ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం జగన్ కు రుచించకపోయినా కొన్ని రోజులకే అదెంత సరైన నిర్ణయమో అందరికీ తెలిసివచ్చింది. ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పరిస్ధితి ఎలా ఉండేదన్న భయాలు జనంలో ఇప్పటికీ ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కానీ ఈ నిర్ణయం సీఎం జగన్ కు ఆగ్రహం తెప్పించడంతో నిమ్మగడ్డకు కష్టాలు తప్పడం లేదు.
హైకోర్టు కరుణించినా.....
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్లదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఇందులో హైకోర్టు ప్రస్తావించిన ఓ అంశం మొత్తం తీర్పునే సంక్షిష్టంగా మార్చేసిందనడానికి ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు అద్దంపట్టాయి. ఈసీగా ఎవరు ఉండాలనే అంశంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదంటూ హైకోర్టు లేవనెత్తిన ప్రశ్న జగన్ కే కాదు చంద్రబాబుకూ వర్తిస్తుందని భావిస్తే నిమ్మగడ్డ పునర్ నియామకం అంశం సంక్షిష్టంగా మారిపోయింది. ఈ ఒక్క అంశం కారణంగా హైకోర్టు తీర్పు తర్వాత హడావిడిగా బాద్యతలు చేపట్టిన నిమ్మగడ్డ... ఆ తర్వాత ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. కానీ హైకోర్టు తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చినా ఎస్ఈసీగా ప్రభుత్వం తనను నియమించడం లేదని నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్లు వేశారు. హైకోర్టు ఉత్తర్వులపై జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ చిక్కుముడి వీడేందుకు మరింత సమయం పడుతోంది.
సుప్రీం వ్యాఖ్యలతో ఊరట....
నిమ్మగడ్డ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా.... తొలి హియరింగ్ లోనే ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. ముఖ్యంగా నిమ్మగడ్డ తొలగింపు కోసం ఇచ్చిన ఆర్డినెన్స్ పై స్పందిస్తూ... ఇదేం ఆర్డినెన్స్ అంటూ సుప్రీం ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు నిమ్మగడ్డకు తాత్కాలిక ఊరటను మాత్రమే ఇచ్చాయి. ఈ వ్యవహారంలో మిగిలిన వారు కూడా కౌంటర్లు దాఖలు చేయాలని సూచిస్తూ సుప్రీంకోర్టు ఈ కేసు విచారణను వాయిదా వేసింది. అసలే కరోనా కారణంగా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్నందున ఈ కేసు విచారణ కూడా ఆలస్యమవుతోంది.
సుప్రీం తీర్పు కోసం ఎదురుచూపులు..
ఎన్నికల కమిషనర్ గా తన పునర్ నియామకంపై హైకోర్టులో అనుకూలంగా తీర్పు వచ్చినా బాధ్యతలు చేపట్టలేని పరిస్ధితుల్లో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వేసిన కేసులో ప్రతివాదిగా ఉన్న నిమ్మగడ్డ.. తన తొలగింపుపై ఏపీ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై సుప్రీంకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యల ఆధారంగా సానుకూల తీర్పు వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడన్నది ఇంకా తేలడం లేదు. ఇవాళ కూడా సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే తుది తీర్పు వస్తుందా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. దీంతో నిమ్మగడ్డ కూడా సుప్రీం తీర్పు కోసం ఎదురుచూడక తప్పని పరిస్ధితి. ఓసారి సుప్రీం తీర్పు వెలువడితే మాత్రం ఆయన తిరిగి ఎన్నికల కమిషనర్ పదవిలో నియామకం కావడం ఖాయమే.