బస్సులు నడపను, బాబు ప్రోత్సాహం: బస్సులకు ఏపీ షాక్పై కేశినేని, పార్టీ మారనని..
అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సులను ఏపీలో తిరగనివ్వరాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ బస్సులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
విజయవాడ: అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సులను ఏపీలో తిరగనివ్వరాదని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆ బస్సులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
చదవండి: టిడిపిలో కలకలం: బాబును లాగిన కేశినేని, అది తప్పని అచ్చెన్న
నిబంధనల్ని ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చే బస్సులను మంగళవారం అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు చంద్రబాబుతో రవాణాశాఖ అధికారులు భేటీ అయ్యారు. ఆ బస్సులు తిరిగితే నిలిపివేస్తామని హెచ్చరించారు.
అర్ధరాత్రి నుంచి బస్సులను నిలిపివేయడంతో అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన ప్రయివేటు బస్సులు షెడ్డులకే పరిమితం అయ్యాయి. చెక్ పోస్టుల్లో ఆ బస్సుల తనిఖీలకు ప్రత్యేకంగా బృందాలను ఉంచారు.
అరుణాచల్ ప్రదేశ్లో రద్దుకు కేశినేని నానినే కారణం
అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏపీలో తిరుగుతున్న బస్సులు 600 వరకు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అక్కడ రిజిస్టరైన బస్సులు కనీసం మూడు నెలలకోసారి ఆ రాష్ట్రంలో తిరగాలి. కానీ చాలా బస్సులు ఆ నిబంధన పాటించటం లేదు. ఇలా చేయటం సరికాదంటూ విజయవాడ ఎంపి కేశినేని నాని అక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏపీ కూడా ఆ బస్సులకు షాకిచ్చింది.
చంద్రబాబు ప్రోత్సాహం.. కేశినేని నాని హ్యాపీ
బస్సులను రద్దు చేస్తున్నట్లు ఏపీ కూడా నిర్ణయం తీసుకోవడంపై ఎంపీ కేశినేని నాని స్పందించారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే చంద్రబాబు ప్రోత్సహిస్తారని చెప్పారు. బస్సుల యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా ఇబ్బంది లేదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కచ్చితంగా సీజ్ చేయవచ్చునని చెప్పారు. బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించడం చంద్రబాబు విజయం అన్నారు. రిజిస్ట్రేషన్లపై పోరాటంలో తన నుంచి అధిష్టానానికి ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.
అంతకుముందు.. ఎవరు మాట్లాడినా వ్యక్తిగతమే
అంతకుముందు కేశినేని నాని మాట్లాడుతూ.. చంద్రబాబు, లోకేష్ మాట్లాడితేనే పార్టీ తరఫున మాట్లాడినట్లు చెప్పారు. తాను లేదా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడితే అంతా వ్యక్తిగతమే అన్నారు. తన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగతమేనని, పార్టీకి సంబంధం లేదన్నారు. అలాగే, తనపై అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు కూడా వ్యక్తిగతమేనని తన అభిప్రాయం అన్నారు.
ఇక్కడ ఊరుకోవడం ఏమిటి
తనకు ఎవరి పైన ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదని కేశినేని నాని చెప్పారు. తన బస్సులు ఇప్పుడు తిరగడం లేదని, భవిష్యత్తులోను తిరగవని చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్ అధికారులు తప్పులు గుర్తించి చర్యలు తీసుకుంటే ఏపీ అధికారులు ఎందుకు ఊరుకుంటున్నారని ప్రశ్నించారు.
ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా
తాను ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతానని అదే సమస్యగా మారిందని కేశినేని నాని అన్నారు. తనకు మాత్రం చంద్రబాబు, లోకేష్, పార్టీ ముఖ్యమని తేల్చి చెప్పారు. తాను పార్టీ కోసమే మొదటి నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు. తాను పార్టీ మారుతానని ప్రచారం జరుగుతోందని అదంతా వట్టిదే అన్నారు. ఇలా ఉండగా.. ప్రయివేటు బస్సులు నిలిచిపోవడంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. విజయవాడ రీజన్లోనే మొత్తం 40 అదనపు బస్ సర్వీసులు నడుపుతున్నారు.