వైఎస్ జగన్ విజ్ఞప్తికి యుద్ధ ప్రాతిపదికన స్పందించిన మోడీ సర్కార్: లేఖ రాసిన రెండో రోజే
విజయవాడ: ప్రాణాంతక కరోనా వైరస్ను నిర్మూలించడానికి దేశవ్యాప్తంగా టీకా ఉత్సవ్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత ఏర్పడిందంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖ పట్ల కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. రాష్ట్రానికి 4.40 లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్ను మంజూరు చేసింది. ఇందులో తొలివిడతగా 4.40 లక్షల డోసుల వ్యాక్సిన్.. సోమవారం రాత్రి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరాయి.
అనంతరం వాటిని అక్కడి నుంచి డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాలకు పంపించారు. దీనికోసం ప్రత్యేక కంటైనర్ను వినియోగించారు.అవన్నీ కోవీషీల్డ్ వ్యాక్సిన్ డోసులు. పుణేలోని సీరమ్ ఇన్స్టిట్యూట్ నుంచి విజయవాడకు చేరుకున్నాయవి. మరో రెండు లక్షల డోసుల వ్యాక్సిన్లు నేడో, రేపో రాష్ట్రానికి రానున్నాయి. నిజానికి- టీకా ఉత్సవ్లో భాగంగా రాష్ట్రానికి 25 లక్షల డోసుల మేర వ్యాక్సిన్ అవసరమౌతుందని, వాటిని వెంటనే పంపించాలని కోరుతూ వైఎస్ జగన్ ఇటీవలే ప్రధానమంత్రికి లేఖ రాశారు.
టీకా ఉత్సవ్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ ఆరు లక్షల మందికి వ్యాక్సిన్లను అందించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నామని పేర్కొన్నారు. నాలుగు రోజుల టీకా ఉత్సవ్ ముగిసే నాటికి 24 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వైఎస్ జగన్ తన లేఖలో ప్రస్తావించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా టీకా పంపిణీ చేస్తున్నామని వివరించారు.
ఈ లేఖపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తొలివిడతలో 4.40 లక్షల డోసుల వ్యాక్సిన్లను పంపించింది. మరో రెండు లక్షల డోసులు కూడా అందనున్నాయి. మరిన్ని విడతల వారీగా రాష్ట్రం కోరిన విధంగా 25 లక్షల వ్యాక్సిన్ డోసులను కేటాయించే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ టీకాలను వేస్తున్నందున.. లక్ష్యాన్ని అందుకుంటామని అధికారులు చెబుతున్నారు. 45 సంవత్సరాలు దాటి, తమ పేర్లను నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.