ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఇక కోవిడ్ మృతులకు మర్యాదగా అంత్యక్రియలు...
కరోనా మహమ్మారి విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న వేళ జనంలో మానవత్వం కూడా కరువవుతోంది. కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వర్తించే విషయంలోనే కాదు, అంత్యక్రియలకు అవకాశం ఇచ్చే విషయంలోనూ కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారిలో ఉన్న భయాలే ఇందుకు కారణం. పరిస్ధితిని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఈ మేరకు అంత్యక్రియలను అడ్డుకోవద్దని పదేపదే పిలుపునిస్తూనే ఉంది. అయినా ఇంకా అమానవీయ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా మృతులకు ఇకపై మర్యాదగా అంత్యక్రియలు నిర్వహించేందుకు వీలుగా ఎల్పీజీ గ్యాస్ దహన వాటికలను సిద్దం చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 38 ఎల్పీజీ దహన వాటికలను నిర్మించనున్నారు. వీటిలో అన్ని సదుపాయాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కో వాటిక ఉండేలా ప్లాన్ చేశారు.
కొన్ని జిల్లాల్లో మాత్రం జనాభాను దృష్టిలో ఉంచుకుని అదనపు వాటికలు కేటాయిస్తున్నారు. హిందూపుర్, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గాల్లో 3 చొప్పున దహన వాటికలు, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, నర్సరావుపేట, ఒంగోలు, కడప, కర్నూలు, విశాఖ పార్లమెంటు నియోజకవర్గాల్లో 2 చొప్పున, మిగిలిన నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున వీటిని ఏర్పాటు చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 35 పురపాలక సంఘాలు, కార్పోరేషన్లలో రూ.51.48 కోట్ల వ్యయంతో 38 ఎల్పీజీ దహన వాటికలు ఏర్పాటు కానున్నాయి. వచ్చే నవంబర్ కల్లా ఇవి అందుబాటులోకి రానున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మృతుల అంత్యక్రియలకు సరైన సదుపాయాలు లేకపోవడం, పర్యావరణ హితంగా ఉండాలన్న డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని వీటికి ప్లాన్ చేస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
రాష్ట్రంలో కరోనా నేపథ్యంలో చోటు చేసుకుంటున్న అమానవీయ ఘటనలను పూర్తి స్దాయిలో నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బొత్స వెల్లడించారు. ఆయా శ్మశాన వాటికల్లో గ్యాస్ లేదా ఎలక్ట్రిక్ ఆధారిత చిమ్ని, కార్యాలయ భవనం, సంప్రదాయబద్దంగా కార్యక్రమాల నిర్వహణకు అనువైన హాల్ , టాయిలెట్లు, నీటి సరఫరా, డ్రైనేజి లేన్ నిర్మాణం తోపాటు ఇతరత్రా ల్యాండ్ స్కేపింగ్ పనులు, ప్రహారీ నిర్మాణం వంటి పనులను ఈ నిధులతో చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు.