ఏపీలో కరోనాపై పోరుకు మరో అస్త్రం- రంగంలోకి సంజీవని బస్సులు- మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్...
కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం దూసుకుపోతోంది.. కరోనా నివారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 10 లక్షల 94 వేల 615 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
వీటి సంఖ్యను మరింత పెంచేందుకు వీలుగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను రూపొందించింది. ఆర్టీసీకి చెందిన 52 బస్సులను తీసుకుని వాటిని కరోనా మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ గా మార్చేసింది.
రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య ను మరింత పెంచే విధంగా ప్రభుత్వ ఆదేశంతో ఆర్టీసీ అధికారులు కోవిడ్ ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. మొత్తం 52 బస్సులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే అధికారులు 30 బస్సులను సిద్ధం చేసి అన్ని జిల్లాలకు పంపించారు. మిగతా బస్సులను కూడా త్వరలో జిల్లాలకు పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక బస్సుల్లో కరోనా టెస్టులకు సంబంధించిన సామాగ్రిని నింపి పంపనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకు 4 కోవిడ్ టెస్ట్ బస్సులు పంపే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంజీవని బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి సామాన్యుడికి కోవిడ్ టెస్ట్ ఉచితంగా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కరోనా టెస్ట్లు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది.