ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం- హైకోర్టులో సీఐడీ కేసుల స్టాండింగ్ కౌన్సెల్కు ఉద్వాసన...
ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్లులో వెలువడుతున్న పలు తీర్పులు, ఉత్తర్వులు పాలనకు ఇబ్బందిగా మారుతున్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభుత్వం హడావిడిగా వ్యవహరిస్తుంటడం వల్లే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు సాక్ష్యాత్తు హైకోర్టు ధర్మాసనమే గతంలో వ్యాఖ్యానించింది. అయినా ప్రభుత్వం తీరు మాత్రం మారడం లేదు.
తాజాగా సీఐడీ కేసుల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా పోలీసు వ్యవస్ద వ్యవహారశైలిపైనా హైకోర్టు పలు తీర్పుల్లో అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఐడీ కేసుల నమోదు విషయంలో హైకోర్టు వ్యాఖ్యలు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టులలో సీఐడీ కేసుల స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్న మేడపాటి బాల సత్యనారాయణ రెడ్డిని తప్పించింది. ఆయనతో రాజీనామా చేయించడంతో పాటు దాన్ని ఆమోదిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
హైకోర్టు వ్యాఖ్యలతో పాటు పలు కేసుల్లో సీఐడీ తరఫున సమర్ధంగా పోరాటం చేయలేకపోతున్నందునే స్టాండింగ్ కౌన్సెల్ను ప్రభుత్వం తప్పించి ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వ్యక్తం కాలేదు. అయితే తాజా పరిణామాలను, హైకోర్టు ఆగ్రహాన్ని చూస్తుంటే ప్రభుత్వం దిద్గుబాటు చర్యలకు దిగినట్లు మాత్రం స్పష్టమవుతోంది. ముఖ్యంగా సీఐడీ కేసుల వ్యవహారాల్లో సమర్ధంగా వాదించే మరో న్యాయవాదిని ఈ స్ధానంలో నియమించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.