విశాఖకు సునామీ, భూకంపాల ముప్పు ?- ఏం పాపం చేసిందంటూ సజ్జల సీరియస్..
విశాఖలో సముద్ర తీరం కోత వల్ల నగరానికి సునామీ, భూకంపాల ముప్పు పొంచి ఉందంటూ తాజాగా మీడియా కథనాలు వచ్చాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ చేసిన ఓ అధ్యయనం ఆధారంగా మీడియాలో ఈ కథనాలు వెలువడ్డాయి. వీటిలో వైజాగ్ తో పాటు ఉత్తరాంధ్రకు సముద్ర తీరం కోత వల్ల సునామీలు, భూకంపాల ముప్పు ఉందంటూ ఈ కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై ఇవాళ వఏపీ సర్కార్ మండిపడింది.
విశాఖ నగరానికి ముప్పంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. విశాఖలో ఏదో జరిగిపోతుందంటూ ఈ కథనాల్లో పేర్కొన్నారని, ఇలాంటి వాటితో విశాఖ ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా అని సజ్జల ప్రశ్నించారు. వైజాగ్ ఏం పాపం చేసిందని, అక్కడి ప్రజలకు ఇలాంటి కథనాలతో ఎలాంటి సందేశం ఇవ్వదల్చుకున్నారంటూ సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే వైజాగ్ ప్రజలతో మాకు రాజధాని వద్దని చెప్పించేలా ఉన్నారని సజ్జల తెలిపారు.
వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలని, విపక్ష టీడీపీ వికేంద్రీకరణకు అనుకూలమా, వ్యతిరేకమా చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. టీడీపీ వెర్షన్ నే రాష్ట్ర బీజేపీ నేతలు వినిపిస్తున్నారని, కేంద్రం ఇప్పటికే రాజధాని రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని చెప్పిందని సజ్జల గుర్తుచేశారు. విభజన చట్టానికీ, రాజధానికీ సంబంధం లేదన్నారు. అన్నీ ఒకే చోట ఉండాలని ఎక్కడా లేదని సజ్జల తెలిపారు.