అందులో జగనే టాప్- చంద్రబాబు అయితే హ్యండ్సప్- జగన్ సలహాదారు సెటైర్లు
ఏపీలో గత ఏడాది కాలంలో చేపట్టిన కరోనా నియంత్రణ విషయంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సక్సెస్ అయిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కరోనా నియంత్రణలో వైసీపీ సర్కారు దేశంలో మిగతా రాష్ట్రాల కంటే మిన్నగా పనిచేసిందన్నారు. ఏడాదిగా కోవిడ్ పరిస్ధితులు ఉన్నా సంక్షేమ ఫథకాలు ఎక్కడా ఆగలేదన్నారు. అదే చంద్రబాబు ఉంటే ఏమయ్యేదో కూడా ఆయన చెప్పేశారు.
రాష్ట్రంలో కోవిడ్ పరిస్దితులను ఎదుర్కొనే విషయంలో వైసీపీ సర్కారు ముందుచూపుతో వ్యవహరించిందని, అదే చంద్రబాబు అయితే అధికారికంగానే చేతులెత్తేసే వారని ప్రభుత్వ సలహాదారు సజ్జల విశ్లేషించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంటే, భారీ స్ధాయిలో ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ప్రభుత్వం కొందరు రాక్షసులు అడ్డుపడుతున్నారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల ద్వారా మహిళలకు సాధికారత కల్పించే యజ్ఞం చేస్తున్నామని, చంద్రబాబు తన హయాంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని సజ్జల ప్రశ్నించారు.
Recommended Video
చంద్రబాబు చెప్పిన విజన్ 2020 అమలుకు అధికారం ఇచ్చినా ఆయన సద్వినియోగం చేసుకోలేకపోయారని సజ్జల విమర్శించారు. 2018లోనే విజన్ 2050కు మారిపోయారని సజ్జల ఆక్షేపించారు. ఐదేళ్ల తర్వాత అయితే ప్రజలు ప్రశ్నిస్తారని ఇలా విజన్లు పెట్టుకుని తప్పించుకన్నారని చంద్రబాబుపై సజ్జల నిప్పులు చెరిగారు. చంద్రబాబు దార్శనికత దురదృష్టం అయితే వైఎస్ జగన్ దార్శనికత అదృష్టమని సజ్జల తెలిపారు. చంద్రబాబు ఎందుకూ పనికిరాని ఓ విజన్తో ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.