ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్- తాత్కాలికంగా మద్యం షాపుల్లో పాత బ్రాండ్లు !
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను జగన్ సర్కార్ రాగానే తీసేసి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకెచ్చి ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారని భావిస్తున్న వారికి ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. తాత్కాలికంగా మద్యం దుకాణాల్లో బార్ల నుంచి కొనుగోలు చేసిన మద్యాన్ని అమ్ముకునేందుకు వీలు కల్పించింది. తద్వారా అటు బార్లతో పాటు మందుబాబులకు కూడా తీపి కబురు చెప్పినట్లయింది.
కరోనాతో బార్లలో స్టాక్ ....
ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో అన్ని షాపులతో పాటు బార్లు కూడా మూతబడ్డాయి. వీటిలో చాలా వరకూ ప్రైవేటు యజమానుల ఆధ్వర్యంలో ప్రభుత్వ బ్రాండ్లతో సంబంధం లేకుండా పాత బ్రాండ్లనే అమ్ముతున్నాయి. ప్రభుత్వం మద్య నిషేధంలో భాగంగా మద్యం షాపుల్లో బ్రాండ్లను మార్చినా బార్లలో మాత్రం చాలా వరకూ పాత బ్రాండ్లే అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్దితుల్లో లాక్ డౌన్ కారణంగా అమ్మకాలు నిలిచిపోవడంతో ఎక్కడి స్టాక్ అక్కడే ఉండిపోయింది. మధ్యలో మద్యం షాపులు తెరిచినా బార్లు మాత్రం తెరుచుకోలేదు. దీంతో బార్లలో స్టాక్ పాడైపోయే పరిస్ధితికి వచ్చింది.
బార్ల విజ్ఞప్తి.. ప్రభుత్వం ఓకే...
లాక్ డౌన్ కారణంగా బార్లలో అమ్మకాలు లేక స్టాక్ మిగిలిపోయింది. ఇది అలాగే ఉండిపోతే పూర్తిగా పాడైపోయి కోట్లాది రూపాయల నష్టాలు తప్పవు. దీంతో బార్లలో పాత స్టాక్ ను మద్యం దుకాణాల్లో అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని యజమానులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనికి ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలపడంతో బార్లలో ఉన్న పాత బ్రాండ్ల మద్యం కొంతకాలం పాటు మద్యం దుకాణాల్లో దర్శనమివ్వబోతోంది. బార్ల యజమానులు తమ వద్ద నున్న పాత స్టాక్ లను మద్యం దుకాణాల్లో తీసుకొచ్చి అప్పగించి రసీదు తీసుకోవాలని ప్రభుత్వం ఇవాళ సూచించింది.
Recommended Video
బార్లకూ, మందుబాబులకూ ఊరట....
ఇప్పటికే కొత్త బ్రాండ్లు, వాటి రేట్లతో ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం భారీ ఊరట కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో డిమాండ్ ఉన్న బ్రాండ్లను బార్ల యజమానులు మద్యం దుకాణాల్లో అమ్ముకునేందుకు వీలు కలుగుతుంది. అదే సమయంలో మందు బాబులకు కూడా కొంతకాలం పాటు పాత బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి. బార్లలో అమ్మే రేటుకే ఈ బ్రాండ్లను మద్యం దుకాణాల్లో తీసుకొచ్చి అమ్మడం ద్వారా వల్ల ప్రభుత్వానికి కూడా ఆర్ధికంగా ప్రయోజనం కలుగుతుంది.