ఎల్జీ పాలిమర్స్ కు జగన్ సర్కార్ తీపి కబురు- హైకోర్టులో కౌంటర్ దాఖలు
విశాఖలో గ్యాస్ లీక్ ప్రమాదం ద్వారా 16 మంది ప్రాణాలను బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ సంస్ధపై ఇప్పటికే నగర వాసులతో పాటు పర్యావరణ నిపుణుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతూనే ఉంది. ఎల్జీ పాలిమర్స్ సంస్ధను విశాఖ నుంచి తరలించాలంటూ స్ధానికులు ఆందోళనలు కూడా చేపట్టారు. అయితే ఎల్జీ పాలిమర్స్ విషయంలో ముందు నుంచీ కఠినంగా వ్యవహరించడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ సర్కారు హైకోర్టులో దాఖలు చేసిన తాజా కౌంటర్లో ఇచ్చిన ఓ వెసులుబాటు మరోసారి చర్చకు తావిచ్చింది.
ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం నేపథ్యంలో సంస్ధకు చెందిన ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించకుండా నిషేధం విధించారు. దీంతో ఎల్జీ పాలిమర్స్ సంస్ధ ఓవైపు ప్రమాదంపై విచారణ ఎదుర్కొంటూనే మరోవైపు ఉత్పత్తులు అమ్ముకోకుండా దాచి పెట్టుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. దీంతో వాటి విక్రయానికి అనుమతివ్వాలని హైకోర్టును ఎల్జీ పాలిమర్స్ కోరింది.
దీనిపై హైకోర్టు ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తాజాగా ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లో ఎల్జీ పాలిమర్స్ తుది ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించేందుకు అనుమతివ్వొచ్చంటూ హైకోర్టుకు సూచన చేసింది. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది. దీంతో త్వరలోనే ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తులు మార్కెట్లో దర్శనమివ్వబోతున్నాయి.