పంచాయతీపోరుపై జగన్-నిమ్మగడ్డ రాజీ ? హైకోర్టు జోక్యంతో ఎన్నికలకు- త్వరలో ఫైనల్
ఏపీలో పెండింగ్లో ఉన్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కరోనా సాకులు చెబుతూ వచ్చిన వైసీపీ సర్కారు ఎట్టకేలకు వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ సూచించిన విధంగా ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది. నిన్న హైకోర్టుకు ఇరుపక్షాలు ఇచ్చిన హామీయే ఇందుకు నిదర్శనం. దీంతో ఏపీలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్తో ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ జరిపే సమావేశంలో ఎన్నికల పోలింగ్ తేదీలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.
పంచాయతీ పోరుపై వెనక్కి తగ్గిన జగన్
కరోనా సమయంలో స్ధానిక సంస్ధల ఎన్నికలేంటని నిన్న మొన్నటి వరకూ మొండికేసిన జగన్ సర్కారు ఇప్పుడు హైకోర్టు జోక్యం, ఇతరత్రా కారణాలతో వెనక్కి తగ్గినట్లే కనిపిస్తోంది. హైకోర్టులో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దాఖలైన కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తాము ఎన్నికల సంఘానికి సహకరించేందుకు సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది చేసిన ప్రతిపాదనను హైకోర్టు కూడా అంగీకరించింది. దీంతో త్వరలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే ఈ ఎన్నికలకు తేదీల ఖరారు కోసం తమకు అనుకూలమైన తేదీలను అధికారులకు ఇచ్చి పంపనుంది.
తాజా పరిణామాలపై నిమ్మగడ్డ హ్యాపీ...
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో తన మాటను లెక్కచేయకుండా మొండికేసిన వైసీపీ సర్కారుపై హైకోర్టులో పైచేయి సాధించడం నిమ్మగడ్డ రమేష్ కుమార్తో పాటు ఎన్నికల సంఘం వర్గాల్లోనూ సంతోషం నింపింది. ఎట్టకేలకు ఎన్నికల సంఘం కోరుకున్న విధంగా ప్రభుత్వం నుంచి సహకరిస్తామన్న హామీ హైకోర్టులోనే లభించడం, ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తకపోవడంతో ఇక ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చని నిమ్మగడ్డ భావిస్తున్నారు. ఈ మేరకు అధికారులకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు.
ఏర్పాట్లు మొదలుపెట్టేసిన నిమ్మగడ్డ
ఇలా హైకోర్టు తీర్పు వచ్చిందో లేదో నిమ్మగడ్డ వెంటనే రంగంలోకి దిగారు. ఏపీలో ఏర్పాటు చేసిన కొత్త నగర పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు జారీ చేశారు. వీటికి కూడా ఇతర పంచాయతీలతో కలిపి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని పురపాలక శాఖను ఆదేశించారు. జనవరి 4 కల్లా ఓటర్ల జాబితా సిద్ధంగా ఉండాలని నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలతో పురపాలకశాఖ కూడా ఆ మేరకు చర్యలు ప్రారంభించింది. తాజా ఆసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్లకు పురపాలకశాఖ నుంచి ఆదేశాలు వెళ్లాయి. కొత్తగా ఏర్పాటు చేసిన నగర పంచాయతీల్లో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట, కొండపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు, గుంటూరు జిల్లాలోని గురజాల దాచేపల్లి, ప్రకాశం జిల్లాలోని దర్శి, నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాలెం, అనంతపురం జిల్లాలోని పెనుకొండ, చిత్తూరు జిల్లా కుప్పం, కర్నూలు జిల్లా బేతంచర్ల, కడప జిల్లా కమలాపురం ఉన్నాయి.
నిమ్మగడ్డ కోర్టులోకి బంతి...
పంచాయతీ ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్తో సంప్రదింపులు జరపడానికి వెంటనే ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసి నిమ్మగడ్డ వద్దకు సంప్రదింపులు జరపబోతోంది. అప్పటి నుంచి ఇక నిమ్మగడ్డ కోర్టులోకి బంతి వెళ్తుందని హైకోర్టు తెలిపింది. దీంతో ఈ భేటీలోనే నిమ్మగడ్డ అధికారులతో మాట్లాడి ఎన్నికల తేదీలను ఖరారు చేస్తారు. వాస్తవానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం మార్చి 31తో ముగిసిపోనుంది. ఆ లోగా పార్టీలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికల నిర్వహణతో ఇబ్బందులు ఉండకపోవచ్చని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది.