ఏపీలో ఇక విద్యుత్ కోతలు ? -దసరా ముగియడంతో-కోతల సమయాలివేనా ?..
ఏపీని బొగ్గు సంక్షోభం కుదిపేస్తోంది. కొన్నిరోజులుగా రాష్ట్రంలో ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు బొగ్గు కొరతతో అల్లాడుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేస్తున్న పరిస్ధితి. అలాగని దసరా సీజన్ లో విద్యుత్ కోతలు విధించే పరిస్ధితి లేదు. దీంతో దసరా పూర్తయ్యే వరకూ వేచి చూసిన ప్రభుత్వం ఇవాళ్టి నుంచి కోతలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కోతల సమయాల్ని కూడా అనధికారికంగా ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. స్ధానిక పరిస్ధితుల ఆధారంగా ఈ సమయాలు ఉంటున్నట్లు సమాచారం.
ఏపీలో బొగ్గు సంక్షోభం
ఏపీలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లను బొగ్గు కొరత వేధిస్తోంది. రాష్ట్రంలో మూడు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంట్ల(ఎస్టీపీసీ)తో పాటు ఓ జాతీయ విద్యుత్ ప్లాంట్ (ఎన్టీపీసీ), మరో 8 ప్లైవేటు ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ ప్లాంట్లకు బొగ్గు సరఫరా ప్రభుత్వం నిర్దేశించిన గనుల నుంచే అందుతోంది. మిగతా ప్లాంట్లు మాత్రం వివిధ మార్గాల్లో బొగ్గును సేకరించుకుంటున్నాయి. తాజాగా బొగ్గు సంక్షోభం, కొరత ఏర్పడటంతో ఈ ప్లాంట్లలో చాలా వాటిలో పరిస్ధితి దారుణంగా తయారైంది. బొగ్గు లేక ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీని తగ్గించుకోవాల్సిన పరిస్ధితి.
ప్రభుత్వం చేతులు కట్టేసిన దసరా
ఏపీలో బొగ్గు సంక్షోభం కారణంగా ధర్మల్ విద్యుత్ ప్లాంట్లపై ప్రభావం పడుతున్నా కోతలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పరిమితులు తప్పలేదు. దసరా నేపథ్యంలో విద్యుత్ కోతలు విధిస్తే ప్రజల్లో ఎక్కడ అసంతృప్తి వస్తుందన్న భయంతో ప్రభుత్వం కోతలకు సిద్ధపడలేదు. అయితే విద్యుత్ పొదుపుగా వాడాలని మాత్రం అధికారులు, ప్రభుత్వ సలహాదారులు పదే పదే ప్రజల్ని కోరారు. అయినా వినియోగదారుల నుంచి పెద్దగా స్పందన లేదు. అయినా ఏమీ చేయలేని పరిస్ధితి. దీంతో దసరా వరకూ వేచి చూసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.
ఏపీలో విద్యుత్ కోతలకు రంగం సిద్ధం
దసరా నేపథ్యంలో విద్యుత్ కోతల ప్రకటనకు ముందూ వెనుకా ఆలోచించిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు దసరా ముగియడంతో విద్యుత్ కోతల ప్రకటనకు సిద్ధమవుతోంది. అధికారికంగా కోతలు ప్రకటించే రోజులు రావొచ్చంటూ తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటన త్వరలో వాస్తవ రూపంలోకి వచ్చేసేలా ఉంది. దీంతో రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో ఎప్పుడెప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడెప్పుడు ఉండదన్న అంశాన్ని విద్యుత్ సంస్ధలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. దీని ప్రకారం త్వరలో కోతలు ప్రారంభమవుతున్నాయి.
విద్యుత్ కోతల వేళలివే
ఏపీలో విద్యుత్ కోతలను ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఈ ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (విద్యుత్ కోతలు) ప్రకారం పల్లెల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ కోత అమల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. . అలాగే మున్సిపాలిటీలు, పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత విద్యుత్ కోతలు ఉంటాయి. ఇక విజయవాడ, విశాఖ, తిరుపతి వంటి పెద్ద నగరాల్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల వరకూ విద్యుత్ కోతలు విధించబోతున్నారు. దీంతో వినియోగదారులు సాయంత్రం నుంచే కోతలకు సిద్ధం కావాల్సిన పరిస్ధితి నెలకొంది.
డిమాండ్ తగ్గకపోతే మరిన్ని కోతలు
ప్రస్తుతం ఎదురవుతున్న విద్యుత్ డిమాండ్ ను బట్టి విద్యుత్ సంస్ధలు ఇప్పటికే కోతలు విధిస్తున్నాయి. అదే విద్యుత్ డిమాండ్ పెరుగుతూ పోతే మాత్రం ఈ కోతల్ని పగలు కూడా పెంచబోతున్నారు. అలాగే ఇప్పటికే పలు గ్రామాల్లో, పట్టణాల్లో విధిస్తున్న కోతలకు అదనంగా వీటిని వర్తింపజేయనున్నారు. డిమాండ్ తగ్గితే మాత్రం కోతల వేళల్లో మార్పులు చేసే అవకాశాలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రస్తుతానికి విద్యుత్ కోతల్ని గృహ వినియోగదారులకు మాత్రం పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ పెరిగితే మాత్రం పరిశ్రమలకు కూడా కోతలు ఉండొచ్చని చెప్తున్నారు.