ఏపీలో ఎంసెట్ సహా ఏడు సెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల- సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 5 మధ్య..
ఏపీలో కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యమవుతోంది. ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించే పరిస్ధితి లేదు. దీంతో మే నెలలో జరగాల్సిన ప్రవేశపరీక్షలు నానాటికీ ఆలస్యమవుతున్నాయి. దీంతో ఎలాగైనా ఈ పరీక్షలు నిర్వహించాలని పట్టుదలగా కనిపిస్తున్న ప్రభుత్వం తాజాగా మరోసారి సెట్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. వీటి ప్రకారం సెప్టెంబర్ 10 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎంసెట్, ఎడ్సెట్, లాసెట్ సహా పలు పరీక్షలు ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం ముందుగ ఐసెట్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 10న ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్ష ఉంటుంది. 10, 11 తేదీల్లో ఐసెట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం జరిగే ఈసెట్ పరీక్ష సెప్టెంబర్ 14న నిర్వహిస్తారు.
17 నుంచి 25వ తేదీ మధ్య ఎంసెట్ నిర్వహించబోతున్నారు. పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పీజీసెట్ కోసం సెప్టెంబర్ 28,29, 30 తేదీలను ఖరారు చేశారు. అక్టోబర్ 1వ తేదీ ఉదయం బీఈడీ ప్రవేశాల కోసం ఎడ్సెట్ పరీక్షనూ, మధ్యాహ్నం లా కోర్సుల కోసం నిర్వహించే లాసెట్ ఉంటుంది. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఐదో తేదీ వరకూ ఏపీపీఈసెట్ నిర్వహిస్తారు.