ఏపీలో కరోనా పరీక్షల కొత్త ధరలివే- ఆరోగ్యశాఖ ప్రకటన.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు...
ఏపీలోని ప్రైవేట్ ల్యాబుల్లో నిర్వహిస్తున్న కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు ఎంతెంత వసూలు చేయవచ్చనే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కరోనా పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్ లు జనాన్ని దోచుకుంటున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటిని ప్రైవేటు ల్యాబ్స్ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. లేకపోతే వాటి లైసెన్స్ ల రద్దుతో పాటు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
ఏపీలో కరోనా పరీక్షల ధరలను నిర్ణయిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నుంచి పంపే శాంపిళ్లు, ప్రైవేటు ల్యాబ్ లు సొంతంగా సేకరించే శాంపిళ్లకు ఈ ధరలు వర్తిస్తాయి. ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్ లలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలకు రూ.750 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ఆదేశించారు. ఆర్టీపీసీఆర్ విధానంలో చేసే పరీక్షకు రూ.2,800 ధరను నిర్ణయించారు. ర్యాపిడ్ కిట్, పీపీఈ కిట్లు, మానవ వనరుల వ్యయం అన్నీ కలుపుకునే ఈ ధరను నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ఐసీఎంఆర్ కు కూడా పరీక్షల ఫలితాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ రెండు పద్ధతుల్లో ఈ ధరలతో కరోనా పరీక్షలు చేయదలుచుకున్న ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు ల్యాబ్ లు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. వీటిని పరిశీలించి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయనుంది. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.