ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ మార్పు-దూరదర్శన్ పాఠాల కొత్త టైమింగ్స్...
ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో విద్యాసంస్ధలు తెరిచే పరిస్ధితి లేకపోవడంతో ఈ నెల 13 నుంచి ఆన్ లైన్ ద్వారా పాఠాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈ క్రమంలో ఈ నెల 13 నుంచి దూరదర్శన్ ద్వారా ప్రతీ రోజూ 1 నుంచి 10 తరగతి వరకూ విద్యార్ధులకు నిపుణులైన అధ్యాపకులతో పాఠ్యాంశాలు బోధించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఓ షెడ్యూల్ విడుదల చేయగా.. తాజాగా అందులో మార్పులు చోటు చేసుకున్నాయి. వీటి ప్రకారం తాజా షెడ్యూల్ ప్రభుత్వం విడుదల చేసింది.
ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసులకు విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం వారంలో ఐదు రోజుల పాటు రోజుకు ఆరు గంటల చొప్పన తరగతులు దూరదర్శన్ సప్తగిరి ఛానల్లో ప్రసారం చేయనున్నారు.
ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకూ పాఠ్యాంశాలు ప్రసారం అవుతాయి. 6-7 తరగతులతు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడింటి వరకూ, 8-9 తరగతులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి నాలుగు గంటల వరకూ పదో తరగతికి సాయంత్రం 4 గంటల నుంచి ఐదు గంటల వరకూ పాఠ్యాంశాల ప్రసారం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.