కాపు రిజర్వేషన్లపై కేంద్రానికి ఎపి సమాధానం;పవన్ కాపు నేతే:బిసి సంఘం
అమరావతి:కాపు రిజర్వేషన్ల విషయమై కేంద్రం అడిగిన రెండు ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. విద్య, ఉద్యోగ రంగాలు సహా అన్నింటిలోనూ వెనుకబడి ఉండటం వల్లే కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి వచ్చిందని ఎపి ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
వారు మిగతా కులాలతో పోటీ పడాలంటే రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బీసీ కమిషన్ నివేదికలోని గణాంకాల ఆధారంగానే వారి జీవన స్థితిగతులు, దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాల సంఖ్య, వివిధ రంగాల్లో ఆయా వర్గాల వెనుకబాటుతనాన్ని ప్రాతిపదికగా తీసుకున్నాట్లు ఎపి ప్రభుత్వం వివరించింది.
కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలను బీసీ 'ఎఫ్' విభాగంలో చేర్చేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ కాపు బిల్లు-2017 గతేడాది డిసెంబరు 2న ఏపీ శాసనసభ, శాసన మండలిలు ఆమోదించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును కేంద్రం ఆమోదానికి పంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రెండు ప్రధాన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాల వివరణను కేంద్ర ప్రభుత్వం కోరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటికి సమాధానాలిచ్చింది.
కేంద్రం అడిగిన ఆ రెండు ప్రశ్నలు...వాటికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానాలు ఇవి...మొదటి ప్రశ్నగా..."సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా 50 శాతం మించి రిజర్వేషన్లు ఉండకూడదు. ఆంధ్రప్రదేశ్ అంతకుమించి రిజర్వేషన్లు ఎందుకు పెంచాల్సి వచ్చింది?" ...అని అడుగగా...ఈ ప్రశ్నకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ఈ వివరణ ఇచ్చారు...
జస్టిస్ మంజునాథ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలోని గణాంకాలు, కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల్లో దారిద్య్రరేఖకు దిగువనున్న వారి వివరాలను ఏపీ ప్రభుత్వ అధికారులు సమర్పించారు. పైన పేర్కొన్న నాలుగు కులాలకు రిజర్వేషన్లు కల్పించినప్పుడే మిగతా కులాలతో వారు పోటీ పడగలరని అందులో వివరించారు. అందుకే రిజర్వేషన్లు 50 శాతం మించుతాయని తెలిపారు.
Recommended Video
ఇక రెండవ ప్రశ్నగా..."ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశాన్ని జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఓబీసీ కమిషన్కు సిఫార్సు చేస్తాం. వారి సూచనల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటాం"...అని కేంద్రం పేర్కొనగా...అందుకు ఏపీ ప్రభుత్వం బదులిస్తూ..."కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రత్యేకంగా చూడాలి...దీన్ని ఓబీసీ కమిషన్కు సిఫార్సు చేయాల్సిన అవసరం లేదు"...అని అభిప్రాయపడింది
ఇదిలావుంటే పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి తాను నిజంగా కాపునేతనేనని నిరూపించుకున్నారని రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు దుయ్యబట్టారు. గురువారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. కేశన మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ ముసుగు తొలిగిపోయి ఆయన నిజంగా కాపు నాయకుడినేనని బయటపడ్డారని ఎద్దేవా చేశారు. సాంఘిక పరమైన వెనుకబాటు లేని కాపులకు బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఇస్తారని కేసన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో సాక్షాత్తూ మావుళ్లమ్మ దేవత సాక్షిగా తాను కాపు నాయకుడని ప్రకటించుకున్నారని కేసన శంకరరావు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఓట్ల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని కేసన ధ్వజమెత్తారు. అగ్రకుల పార్టీల నాయకులంతా ఓట్ల రాజకీయాల కోసం రాజ్యాంగ బద్ధత లేని వాగ్దానాలు చేస్తూ కులాల కుంపటి రగుల్చుతున్నారని ఆయన మండిపడ్డారు. అగ్ర కులాన్ని బీసీల్లో చేర్చాలనే ప్రయత్నాన్ని ఐక్యంగా తిప్పికొడతామని కేసన హెచ్చరించారు.