ఎస్వీబీసీ ఛైర్మన్గా సాయికృష్ణ యచేంద్ర: ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి, వైసీపికి దగ్గరగా..
అమరావతి/తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్గా నెల్లూరు జిల్లా వెంకటగిరి రాజ కుటుంబీకులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వీబీ సాయికృష్ణ యచేంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా, రెండేళ్లపాటు సాయికృష్ణ ఎస్వీబీసీ ఛైర్మన్గా కొనసాగనున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పిలుపుమేరకు సాయికృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో వెంకటగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల నుంచి ఆయన కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరైంది.
ఈ నేపథ్యంలోనే సాయికృష్ణను ఎస్వీబీసీ ఛైర్మన్గా వైసీపీ సర్కారు నియమించినట్లు తెలుస్తోంది. కాగా, గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్గా ఉన్న సినీనటుడు పృథ్వీరాజ్ ఆ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మహిళా ఉద్యోగినితో అనుచితంగా ప్రవర్తించారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పృథ్వీరాజ్ రాజీనామా చేశారు. తిరిగి ఎలాంటి వివాదాలకు తావివ్వకూడదనే.. నూతన ఛైర్మన్ విషయంలో ఏపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏకాంతంగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు: టిటిడి నిర్ణయం
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 11 నుంచి 19వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో బుధవారం జెఈవో పి.బసంత్కుమార్ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్శకాలు, భక్తుల ఆరోగ్య భద్రత, అమ్మవారి వాహన సేవలు, పంచమి తీర్థం నిర్వహణపై ఆగమ సలహాదారు, జీయ్యంగార్ల ప్రతినిధులు, అధికారులతో జెఈవో కూలంకషంగా చర్చించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జెఈవో బసంత్కుమార్ మాట్లాడుతూ.. కోవిడ్ -19కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అక్టోబరు నెలాఖరు వరకు అమలు చేస్తున్న మార్గదర్శకాలను నవంబరు నెలాఖరు వరకు పొడిగించిందని చెప్పారు. వీటిని దృష్టిలో ఉంచుకుని అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఆగమ శాస్త్రం, సంప్రదాయాలకు కట్టుబడి ఏకాంతంగా నిర్వహించాల్సి ఉందన్నారు. ఉద్యాన, విద్యుత్ విభాగాల అధికారులు ఆలయం అలంకరణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.