దేవాలయాలపై దాడులు: సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కారు కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ సర్కారు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది.
ఏసీబీ అదనపు డైరెక్టర్ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో నియమిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. సిట్లో 16 మంది సభ్యులుగా ఉండనున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తదితరులకు ఆ బృందంలో స్థానం కల్పించారు. గత సంవత్సరం సెప్టెంబర్ 20 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయిన విగ్రహాల ధ్వంసం కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది.
ఫొరెన్సిక్, సీఐడీ, సైబర్ క్రైమ్ విభాగాల సమాచారం తీసుకోవాల్సిందిగా ఏపీ సర్కారు సిట్కు సూచించింది. కాగా, ఆలయాల దాడులకు సంబంధించి అన్ని కేసులను సిట్ విచారించనుంది. రాష్ట్రంలో ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం సంఘటనలను కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధి విధానాలను నిర్దేశిస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలతోపాటు విధివిధానాలను నిర్దేశిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల విజయనగరం జిల్లా రామరతీర్థంలో జరిగిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీఐడీ దర్యాప్తును ఆదేశించిన విషయం తెలిసిందే. అదనపు డీజీ సునీల్ కుమార్ నేతృత్వంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.
రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాల విధ్వంసంపై బీజేపీ,, జనసేన టీడీపీతోపాటు ఇతర హిందూ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి రాగానే దాడులు మొదలయ్యాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.