నాలుగు నాన్ మేజర్ పోర్టులపై ఏపీ సర్కార్ దృష్టి- బందరు నుంచి మొదలు- డీపీఆర్ ఆమోదం..
ఏపీలో నాలుగు నాన్ మేజర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో కీలకమైన బందరు పోర్టు నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఎప్పుడో టీడీపీ హయాంలోనే ఆమోదించిన డీపీఆర్, పాలనా అనుమతులను సమీక్షించి పక్కనబెట్టిన వైసీపీ సర్కార్.. తిరిగి సవరించిన డీపీఆర్ను ఆమోదిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో పాటే పోర్టు అభివృద్ధికి పాలనా పరమైన అనుమతులు కూడా మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మచిలీపట్నం పోర్టు విషయంలో మరోసారి ముందడుగు పడినట్లయింది. ఇక దీనికి నిధుల కేటాయింపు, పర్యవేక్షణ సక్రమంగా సాగితే ఈ పురాతన పోర్టుకు విదేశీయుల పాలన నాటి వైభవం తిరిగి రానుంది.
మచిలీపట్నం పోర్టుపై ముందడుగు...
ఏపీలోని కృష్ణాజిల్లాలో ఉన్న మచిలీపట్నం పోర్టు గతంలో మాసులా పోర్టు పేరుతో రోమన్, గ్రీక్ సామ్రాజ్యాలకు ఎగుమతులు, దిగుమతులకు ఉపయోగపడింది. ఇక్కడి నుంచి అప్పట్లో భారీగా వాణిజ్యం సాగేదని చెబుతారు. కానీ స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధికి నోచుకోని బందరు పోర్టును అభివృద్ధి చేస్తామని ప్రతీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు హామీ ఇస్తూనే ఉంటాయి. అయితే 2008లో వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో దీనికి అసలు ముందడుగు పడింది.
వైఎస్ హయాంలో శంఖుస్ధాపన జరిగినా ఆ తర్వాత చంద్రబాబు హయాం వరకూ మరో అడుగు లేదు. తిరిగి చంద్రబాబు ఈ పోర్టుకు శంఖుస్ధాపన చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా భూసేకరణ సమస్యగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు తిరిగి జగన్ సర్కారు గతంలో ఆమోదించిన డీపీఆర్ను సవరించి ఆమోదించింది.
నవయుగ నుంచి రైట్స్కు మారిన కాంట్రాక్టు...
టీడీపీ హయాంలో బందరు పోర్టు నిర్మాణాన్ని నవయుగ సంస్ధకు అప్పగించగా.. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో దాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత రైట్స్ సంస్ధకు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించడం, కొత్త డీపీఆర్ను తాజాగా ఆమోదించడం జరిగిపోయాయి. గతేడాది డిసెంబర్ నాటికే డీపీఆర్ సమర్పించాల్సి ఉన్నా కాస్త ఆలస్యంగా ఈ డీపీఆర్ ప్రభుత్వానికి అందింది. దీన్ని పరిశీలించాక తాజాగా ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటే పోర్టు నిర్మాణానికి పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
మూడేళ్లలో తొలిదశ పూర్తి...
బందరు పోర్టు నిర్మాణం కోసం రైట్స్ సంస్ధ ఆగస్టు 31న ప్రభుత్వానికి డీపీఆర్ సమర్పించింది. దీన్ని ప్రభుత్వం తాజాగా ఆమోదించింది.
ప్రభుత్వం తాజాగా ఆమోదించిన డీపీఆర్ ప్రకారం రూ.5835 కోట్ల వ్యయంతో 36 నెలల వ్యవధిలో పోర్టు తొలిదశ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇందులో రూ.4745 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి ఏపీ మారిటైమ్ బోర్డు సేకరించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పోర్టు కోసం గతంలో సేకరించిన దాదాపు 5 వేల ఎకరాలకు అదనంగా మరో 225 ఎకరాలు సేకరించేందుకు ఏపీ మారిటైమ్ బోర్డు 90 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. తొలిదశలో భాగంగా నాలుగు సాధారణ కార్గో, ఓ బొగ్గు, ఓ కంటెయినర్ బెర్త్లను నిర్మిస్తారు. 800 ఎకరాల్లో వీటి కోసం మౌలిక సదుపాయాల ఏర్పాటు చేస్తారు.
కార్గో రవాణాతో భారీ ఉపాధి, ఆదాయం...
మచిలీపట్నం పోర్టు నిర్మాణం పూర్తయితే ఐదు వేల మందికి ప్రత్యక్షంగా, మరో 15 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
అలాగే ప్రభుత్వానికి భారీగా ఆదాయం కూడ సమకూరనుంది. రాష్ట్రంలో నాలుగు నాన్ మేజర్ పోర్టులను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటన్నింటి ప్రదాన ఉద్ధేశం కార్గో రవాణాయే. రాబోయే రోజుల్లో కార్గో రవాణాకు భారీ డిమాండ్ ఉండబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ పోర్టులపై భారీ ఎత్తున నిధులు వెచ్చించేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇందులో కాకినాడ, భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం ఉన్నాయి. ఇవన్నీ సిద్దమైతే వీటి ద్వారా 2024-25 నాటికి ఏటా 300-350 మిలియన్ టన్నులకు కార్గో రవాణా చేరుకుంటుందని అంచనా.