కరోనా టెస్టింగ్ కిట్లు.. మంత్రి ఆళ్ల నాని ట్విస్ట్.. కేంద్రం ఎంతకు కొన్నదంటే..?
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డిపై బుదరజల్లుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. చంద్రబాబు కుటిల ప్రయత్నాల్లో భాగస్వామిగా మారి.. ఆఖరికి బీజేపీ గౌరవాన్ని కూడా ఆయన కోసం పణంగా పెడుతున్నారని విమర్శించారు. కరోనా నియంత్రణ చర్యల విషయంలోనూ ప్రధానికి తానే మార్గనిర్దేశం చేస్తున్నానని చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటుంటే.. ఆ వ్యాఖ్యలు సరికాదని కన్నా ఏనాడైనా ఖండించారా అని ప్రశ్నించారు. నిరాధార ఆరోపణలు,విమర్శలతో ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. అదే సమయంలో కిట్ల కొనుగోళ్లకు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
కేంద్రం ఎంతకు కొనుగోలు చేసిందంటే..
మంత్రి కన్నాను తాను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నానని ఆళ్ల నాని పేర్కొన్నారు. తాము రూ.730 చొప్పున లక్ష ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లకు ఆర్డర్ ఇచ్చామని... కానీ తమ తర్వాత ఐసీఎంఆర్ ద్వారా కేంద్రం ఒక్కో టెస్టింగ్ కిట్కు రూ.790 చొప్పున 5లక్షల కిట్లకు ఆర్డర్ ఇచ్చిందన్నారు. ఒకవేళ తాము చేసింది అవినీతే అయితే.. మరి దీన్ని ఏమంటారని ప్రశ్నించారు. కేంద్రం కంటే తాము రూ.65 తక్కువకే కిట్లు కొనుగోలు చేశామన్నారు. కేంద్రాన్ని విమర్శించాలన్న ఉద్దేశంతో ఈ విషయాలు చెప్పట్లేదని.. నిజాలు తెలియజేయాలన్న ఉద్దేశంతో చెబుతున్నామని అన్నారు. అంతేకాదు, తాము కిట్లకు ఆర్డర్ ఇచ్చినప్పుడు.. ఒప్పందంలో స్పష్టమైన షరతు పెట్టామని తెలిపారు. దాని ప్రకారం.. ఏ రాష్ట్రానికి అంతకంటే తక్కువకు కిట్లు ఇచ్చినా.. తమకూ అదే ధరకు కిట్లు విక్రయించాలని చెప్పామన్నారు.
కరోనాకు భయపడి ఇళ్లల్లో టీడీపీ నేతలు..
నిన్నటిదాకా ప్రతిపక్షాలు కరోనా నియంత్రణ చర్యలకు అడ్డు తగిలాయని.. ఇప్పుడు కిట్ల వ్యవహారంపై పడ్డాయని నాని విమర్శించారు. నిజానికి ఊహించని విపత్తు ఎదురైనా.. ఏపీ ప్రభుత్వం ముందుగా మేల్కొని సకాలంలో సరైన చర్యలు తీసుకుందన్నారు. మొదటి 10,15 రోజుల్లో తప్ప.. ఇప్పుడెక్కడ ఏవిధమైన కొరత లేదన్నారు. వెంటిలేటర్లు,పీపీఈలు,మాస్కులు అన్నింటిని సమకూర్చుకున్నామని చెప్పారు. క్వారెంటైన్ కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేవని నిన్నటిదాకా టీడీపీ నేతలు విమర్శించారని.. కరోనాకు భయపడి ఇంట్లో దాక్కున్నవాళ్లు కూడా క్వారెంటైన్ సదుపాయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం లాక్ డౌన్ పరిస్థితులను పరిశీలించేందుకు బయటకొచ్చే దమ్ము కూడా టీడీపీ నేతలకు లేదన్నారు.
Recommended Video
పారదర్శక పాలన అందిస్తున్నామన్న మంత్రి
ఇటీవలే మరో 5500 డాక్టర్ల రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ ఇచ్చామని నాని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని.. పారదర్శక పాలనను ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతోనే ఈ వివరాలు వెల్లడిస్తున్నామని తెలిపారు. తమ లాగా లక్ష కిట్లను ఒకేసారి సౌత్ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న రాష్ట్రం మరొకటి లేదన్నారు. ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇవ్వవచ్చు గానీ.. మొదట తెప్పించుకుంది మాత్రం తామేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ముందు చూపు వల్లే ఇది సాధ్యపడిందన్నారు. కరోనా నియంత్రణ చర్యల కోసం ప్రభుత్వం అన్ని విధాలా అవసరమైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ మూడు సర్వేలు నిర్వహించి 32వేల అనుమానితుల జాబితాను తయారుచేసినట్టు తెలిపారు. ఇటీవల తెప్పించిన కిట్ల ద్వారా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రతీ అంశంలోనూ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తోందని.. ప్రజలు అన్నీ గమనించాలని విజ్ఞప్తి చేశారు.