వైజాగ్లో సీఎం గెస్ట్హౌస్- హైకోర్టు స్టేను సుప్రీంలో సవాల్ చేసిన జగన్ సర్కార్
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ నానాటికీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించేందుకు వీలుగా నగరంలో ఓ గెస్ట్హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం గతంలో ఆదేశాలు ఇచ్చింది. వీటిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు.. గెస్ట్హౌస్ నిర్మాణం చేపట్టకుండా స్టే ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని ఇవాళ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభమై ఏడాది కావస్తున్నా దీనిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన రాజధాని బిల్లులను గవర్నర్ హరిచందన్ ఆమోదించి గెజిట్ విడుదల చేసినా వాటి అమలు ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్ధితి. ఈ బిల్లులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు రోజువారీ విచారణ జరుపుతున్నా ఇప్పట్లో ఈ వ్యవహారం తేలేలా కనిపించడం లేదు. అమరావతికి సంబంధించి ఉన్న సంక్లిష్టతలే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణ సాగిస్తోంది.
Recommended Video
మూడు రాజధానుల వ్యవహారం తేలే లోపు విశాఖ నుంచి సీఎం జగన్ పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా విశాఖలో సీఎం కోసం గెస్ట్హౌస్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన హైకోర్టు గెస్ట్ హౌస్ నిర్మాణం చేయకుండా స్టే ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై పలుమార్లు విచారణ జరిగినా తుది నిర్ణయం మాత్రం రాలేదు. దీంతో స్టే కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టులో దీన్ని సవాలు చేసింది. విశాఖలో సీఎం గెస్ట్హౌస్ నిర్మాణానికి అనుమతివ్వాలని సుప్రీంను కోరింది. ఈ పిటిషన్ వచ్చేవారం విచారణకు రానుంది.