సుప్రీం కోర్టుకు ఏపీ రాజధాని గెజిట్లు- హైకోర్టు స్టే కొట్టేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్..
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం మరోసారి సుప్రీంకోర్టులోకి వెళ్లింది. అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించిన తర్వాత జారీ అయిన గెజిట్ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సమగ్ర విచారణ జరపకుండానే, ప్రాథమిక కారణాలు తెలియకుండానే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని ప్రభుత్వం ఎస్ఎల్పీలో పేర్కొంది. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని తెలిపింది.
హైకోర్టు ఎక్స్పార్టీగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టివేయాలని ఏపీ ప్రభుత్వం తన స్పెషల్ లీవ్ పిటిషన్లో పేర్కొంది. దీంతో మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరినట్లయింది. రాజధానుల గెజిట్ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టే విధించడం వల్ల ప్రభుత్వ కార్యాలయాలను విశాఖ తరలించకుండా బ్రేక్ పడింది. వాస్తవానికి ఈ నెల 6వ తేదీన రాజధాని పిటిషన్లపై విచారణ పెండింగ్ లో ఉండగానే హైకోర్టు 4న గెజిట్లపై స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతోపాటు తదుపరి విచారణను 14వ తేదీకి వాయిదా వేసింది. కాబట్టి ప్రభుత్వం అంతవరకూ ఏమీ మాట్లాడేందుకు వీలు లేకుండా పోయింది.
Recommended Video
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనకున్న న్యాయపరమైన అవకాశాన్ని వినియోగించుకోవడం కోసం సుప్రీంకోర్టు తలుపుతట్టింది. సుప్రీంలో సానుకూల ఫలితం వెలువడితే గెజిట్ల ఆధారంగా ప్రభుత్వ కార్యాలయాల తరలింపు తిరిగి ప్రారంభం కానుంది.