ఏపీలో విద్యుత్ కోతల్లేవ్-అంతా ఒట్టి ప్రచారం-జగన్ సర్కార్ క్లారిటీ
దేశవ్యాప్తంగా నెలకొన్న బొగ్గు కొరత నేపథ్యంలో ఏపీలోని ధర్మల్ విద్యుత్ ప్లాంట్లకు కూడా బొగ్గు సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంగా విద్యుత్ కోతలు తప్పవని తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో రాష్ట్రంలో భారీ విద్యుత్ కోతలు తప్పవనే ప్రచారం ఊపందుకుంది. వివిధ ప్రసార మాధ్యమాలతో విద్యుత్ కోతలంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఇవాళ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
ఏపీలో విద్యుత్ కోతలంతా జరుగుతున్న ప్రచారం అవాస్తవమంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ కోతలపై జరుగుతున్న ప్రచారం అంతా ఒట్టిదేనని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు విధించే పరిస్ధితి లేదన్నారు. విద్యుత్ కోతలపై వచ్చిన వార్తల్ని ఆయన ఖండించారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం లేదని తెలిపోయింది. అలాగే బొగ్గు కొరత ఉన్నప్పటికీ జల విద్యుత్ తో పాటు సంప్రదాయేత విద్యుత్ అందుబాటులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
దసరా పండుగ తర్వాత గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో, నగరాల్లో లోడ్రిలీఫ్రరిట గంటలకొద్దీ కరెంటు కోతలు ఉంటాయంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామని ఇందన శాఖ తెలిపింది. బొగ్గు నిల్వలు, సరఫరాల్లో అంతర్జాతీయంగా, దేశీయంగా ఉన్న పరిణామాలు విద్యుత్ ఉత్పత్తిపై పెను ప్రభావాన్ని చూపుతున్న విషయం అందిరికీ తెలిసిందేనని, ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయని తెలిపింది.
సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యవసర ప్రణాళికల అమలును వెంటనే ప్రారంభించినట్లు ఇంధన శాఖ తెలిపింది. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏ పి జెన్కో కు అత్యవసరంగా రూ . 250 కోట్లు నిధులు, బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చ బడ్డాయని వెల్లడించింది. రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయని తెలిపింది. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయవలసినది గా ఏ . పి జెన్కో కు ఆదేశాలు ఇవ్వ బడ్డాయని ఇంధన శాఖ ప్రకటన వెల్లడించింది. స్వల్ప కాలిక మార్కెట్ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్ పంపిణి సంస్థలను ఆదేశించడం జరిగిందని, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి ఎవ్వరికి కేటాయింపబడని విద్యుత్ వాటా నుంచి , వచ్చే సంవత్సరం జూన్ వరకు , ఆంధ్ర ప్రదేశ్ కోసం దాదాపు 400 మెగావాట్లు చౌక ధర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు అభర్ధన పెట్టటం జరిగిందని పేర్కొది.
బొగ్గు సరఫరా కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలతో నిమిత్తం లేకుండా కొరతతో వున్న విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చెయ్యాలన్న కేంద్ర మార్గ దర్శకాలకు అనుగుణంగా మన రాష్ట్రానికి సరఫరా చేసే అన్ని బొగ్గు ఉత్పత్తి సంస్థలతో మాట్లాడటం జరిగిందని ఇంధన శాఖ తెలిపింది. పొరుగు రాష్ట్రంలో ఉన్న సింగరేణి సంస్థతో సమన్వయము చేసుకుని మన రాష్ట్రము లో వున్న కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా కోసం నిరంతర ప్రయత్నం జరుగుతోందని వెల్లడించింది. విటిపిఎస్ లోను మరియు కృష్ణపట్నంలోనూ కొత్త 800 వెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను ప్రారంభించడానికి మరియు తొందరగా అందుబాటులోకి తేవటానికి తగిన చర్యలు తీసుకోవటం జరుగుతోందని తెలిపింది.
దేశవ్యాప్తంగా కొన్ని రోజులుగా నెలకొన్న బొగ్గు కొరత ప్రభావం ఏపీలో పడుతోందని తాజాగా ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తెలిపారు. దీంతో వినియోగదారులు పీక్ అవర్స్ లో సాధ్యమైనంత తక్కువ విద్యుత్ వాడాలని, ఏసీలు ఇతర పెద్ద విద్యుత్ గృహోపకరణాలు వాడొద్దంటూ సూచించారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తప్పదని అంతా భావించారు. అదే సమయంలో పలు జిల్లాల్లో అధికారులు విద్యుత్ కోతల్ని అనధికారికంగా అమలు చేస్తుండటంతో దీనిపై గందరగోళం నెలకొంది. ఈ సమయంలోనే సోషల్ మీడియాలోనూ ఇవాళ్టి నుంచి అధికారిక విద్యుత్ కోతలంతా వార్తలొచ్చాయి. ఇవాళ దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.