ఏపీ ప్రభుత్వంలో డబుల్ పేమెంట్స్- 649 కోట్లు చెల్లింపు- పొరబాటు జరిగిందంటున్న ఆర్ధికశాఖ
ఏపీ ప్రభుత్వంలో డబుల్ పేమెంట్స్ వివాదం కలకలం రేపుతోంది. అసలే అప్పులతో కాలం గడుపుతున్న ప్రభుత్వం పింఛన్ల పేరుతో భారీ మొత్తాన్ని అదనపు చెల్లింపులు చేయడమేంటని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరావు ప్రశ్నించడంతో ఉలిక్కి పడ్డ ప్రభుత్వం ఇవాళ దీనిపై వివరణ ఇచ్చింది. కానీ ఎక్కడా లేని విధంగా టీడీపీ హయాంలో నెలకొల్పిన సీఎఫ్ఎంఎస్ వ్యవస్ధ ఉండగా ఈ అదనపు చెల్లింపులు ఎందుకు జరిగాయన్న అంశాన్ని టీడీపీ ప్రశ్నిస్తోంది. అసలు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొత్తం చెల్లింపులపై వివరాలు వెల్లడించాలని కోరుతోంది.
డబుల్ పేమెంట్స్ వివాదం...
ఏపీ ప్రభుత్వంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా డబుల్ పేమెంట్స్ జరిగాయంటగా అనే చర్చ నడుస్తోంది. ఇందుకు కారణం నిన్న టీడీపీ నేత దేవినేని ఉమమహేశ్వరావు పింఛన్ల చెల్లింపుల కోసం ప్రభుత్వం రూ.1400 కోట్ల రూపాయలను రెండుసార్లు చెల్లించిందని, ఇలా మొత్తం రూ.2800 కోట్లు అధికారులకు చేరాయని ఆరోపించారు. రాయలసీమలో కాంట్రాక్టర్లకు కూడా ఇలా రెండుసార్లు చెల్లింపులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఇంత భారీ మొత్తాన్ని ప్రభుత్వం అలా ఎలా రెండుసార్లు చెల్లింపులు చేయాల్సి వచ్చిందనే చర్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఈ డబుల్ చెల్లింపులేంటని సీఎంవో నుంచి ఆర్ధిక శాఖ వివరణ కోరారు.
ఆర్ధికశాఖ వివరణ...
గత నెల 31వ తేదీన ఈ నెల సామాజిక పింఛన్ల కోసం ఆర్ధికశాఖ చెల్లింపులు చేసింది. ఇందులో రూ.649 కోట్ల మొత్తం గ్రామ కార్యదర్శులకు అదనంగా చెల్లింపులు చేసినట్లు ఆర్ధికశాఖ అంగీకరించింది. ఇది పొరబాటున చెల్లింపు చేసినట్లు, ఆ తర్వాత తప్పు తెలుసుకుని ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దీంతో ఈ వివాదం తాత్కాలికంగా ముగిసింది. అయితే రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న పరిస్ధితుల్లో ఇంత భారీ మొత్తాన్ని ఆర్ధికశాఖ అధికారులు, ఆన్లైన్ విధానంలో ఇలా రెండోసారి ఎలా చెల్లింపు చేశారన్న చర్చ మాత్రం సాగుతోంది. దీనిపై అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఆర్ధిక ఇబ్బందుల వేళ ...
అసలే ప్రభుత్వం ఆర్దిక ఇబ్బందుల్లో ఉంది. తామరతంపరగా పుట్టుకొస్తున్న పథకాలకు చెల్లింపులు చేయలేక ఆర్ధిక శాఖకు ముచ్చెమటలు పడుతున్నాయి. నెల చివరి వారం వస్తుందంటే చాలు జీతభత్యాలు, పింఛన్లకు చెల్లింపులు ఎలా చేయాలని అధికారులు తలలు పట్టుకుంటున్న పరిస్దితి. అప్పులు దాటి చేబదులు తెచ్చుకుని మరీ చెల్లింపులు చేసుకోవాల్సిన పరిస్దితి. కేంద్రం నుంచి రావాల్సిన ఆర్ధిక లోటు రాకపోగా.. రుణాల పరిమితి పెంచేందుకు సవాలక్ష నిబంధనలు విధిస్తున్న స్ధితి. ఇలాంటి పరిస్ధితుల్లో ఆర్ధికశాఖ అధికారులు నిర్లక్ష్యంగా రూ.649 కోట్ల మొత్తాన్ని పొరబాటున అకౌంట్లో వేశామని చెప్పి చేతులు దులుపుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రతీ రూపాయి జాగ్రత్తగా ఖర్చుపెట్టాల్సిన పరిస్ధితి ఎంత పింఛన్లయితే మాత్రం ఇలా డబుల్ పేమెంట్స్ చేస్తారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.