ఆఫీసులన్నీ ఒకే చోటెందుకు ? హైకోర్టు ముందుకు శివరామకృష్ణన్ నివేదిక- ఏపీ సర్కార్ కౌంటర్
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న వైసీపీ సర్కారు హైకోర్టులో మరో కౌంటర్ దాఖలు చేసింది. ఇందులోనూ వికేంద్రీకరణ అవసరంతో పాటు అమరావతిలో మూడు పంటలు పండే భూములపై గతంలో రాజధాని ఎంపిక కోసం కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రస్తావించింది. దీంతో తాము శివరామకృష్ణన్ కమిటీ సూచనల ప్రకారమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
గతంలో హైదరాబాద్ అనుభవాల దృష్ట్యా ఏపీలో ప్రధాన కార్యాలయాలన్నీ ఒకే చోట వద్దని శివరామకృష్ణన్ కమిటీ సూచించిందని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన తాజా కౌంటర్లో పేర్కొంది. నిధులను పారదర్శకంగా వినియోగించాలన్న ఉద్దేశంతోనే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అమరావతిలో పనులు నిలిపేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే అమరావతి దేశ ఆహార అవసరాల్లో ఒకశాతం తీరుస్తున్న విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని కోర్టు దృష్టికి ప్రభుత్వం తెచ్చింది. ఈ నేపథ్యంలో అక్కడ రాజధాని సరికాదని తెలిపింది..
Recommended Video
అలాగే శివరామకృష్ణన్ కమిటీ భూసమీకరణ ద్వారా ప్రైవేటు భూములు సేకరించవద్దని చెప్పిన విషయాన్నీ, దాన్ని పక్కనబెట్టి గత టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ప్రభుత్వం కౌంటర్లో పేర్కొంది. అలాగే రాజధాని పేరుతో ఈ ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్పై సీఐడీ విచారణ, అనంతరం సీబీఐ కేసులు నమోదు చేయడం, తదనంతర పరిణామాలను కూడా ప్రభుత్వం తాజా కౌంటర్లో హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.