రాజధాని తరలింపుపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు- జగన్ నిర్ణయంపై క్లారిటీ ఇదే...
ఏపీ అసెంబ్లీలో రాజధాని బిల్లలు రెండోసారి ఆమోదం పొందిన నేపథ్యంలో విశాఖకు తరలింపు ఉంటుందా లేదా అన్న అంశంపై రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో చర్చ సాగుతోంది. కరోనా ప్రభావం ఉన్నందున రాజధాని తరలింపుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని ప్రజలు కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో కీలక మంత్రి, సీఎం జగన్ కు సన్నిహితుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.
జగన్ సర్కార్పై నిమ్మగడ్డ ఎదురుదాడి? ఆ విషయంలో హైకోర్టులో పిటీషన్? అడ్వొకేట్ జనరల్పై
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాజధాని తరలింపుపై ఇప్పుడు మాట్లాడే పరిస్ధితి లేదన్నారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన పెద్దిరెడ్డి... రాజధానిపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. జూలైలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని, అవి తగ్గాక సరైన నిర్ణయం తీసుకుంటామని పెద్దిరెడ్డి తెలిపారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పినట్లు మూడు రాజధానుల ఏర్పాటు మాత్రం జరిగి తీరుతుందన్నారు.
ఏపీ శాసన సభలో రాజధాని బిల్లులను పట్టుబట్టి మరీ రెండోసారి హడావిడిగా ప్రవేశపెట్టిన ప్రభుత్వం కరోనా ప్రభావం తగ్గగానే రాజధాని తరలింపుకు సిద్ధమయ్యే సంకేతాలు వెలువడుతున్న తరుణంలో మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలను సీపీఐ తప్పుబట్టింది. రాజధాని తరలింపుపై పెద్దిరెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. రాజధాని తరలింపు హైకోర్టులో పెండింగ్ లో ఉందని, బిల్లులను సైతం మండలి సెలక్ట్ కమిటీకి పంపిందని అటువంటప్పుడు మంత్రి వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు రావా అని రామకృష్ణ ప్రశ్నించారు.