చంద్రబాబు కూల్చారు..జగన్ పునర్నిర్మించబోతున్నారు.. కేంద్రం నుంచి నిధులు!
విజయవాడ: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాలన్నింటినీ పునర్నిర్మించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. కూల్చివేసిన ప్రదేశంలోనే ప్రతి ఆలయాన్ని పునర్నిర్మించడానికి దేవాదాయ శాఖ అవసరమైన చర్యలను తీసుకోనుంది. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను సంబంధిత శాఖ చేపట్టనుంది. ఆలయాల పునర్నిర్మాణ బాధ్యతలు, నిర్మాణ పనుల పర్యవేక్షణ వ్యవహారం మొత్తాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించవచ్చని చెబుతున్నారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యకలాపాల్లో అనుభవం ఉన్న సంస్థలకు మాత్రమే టెండర్లలో పాల్గొనేలా నిబంధనలను రూపొందించినట్లు తెలుస్తోంది.
విజయవాడలో.. పదుల సంఖ్యలో..
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజయవాడలో పదుల సంఖ్యలో ఆలయాలు కూల్చివేతకు గురైన విషయం తెలిసిందే. విజయవాడను తాత్కాలిక రాజధానిగా ప్రకటించినందున వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుందనే ఉద్దేశంతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం పలు దేవాలయాలను కూల్చివేసింది. చిన్నా, చితక ఆలయాలు సహా ఓ మోస్తరు పేరున్నవి, శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న పురాతన ఆలయాలను కూడా తొలగించింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదురైనప్పటికీ.. పెద్దగా పట్టించుకోలేదు. వాహనాల రాకపోకలకు అడ్డంకిగా ఉంటాయనే ఉద్దేశంతోనే తొలగిస్తున్నట్లు వివరణ ఇచ్చుకుంది.
కేంద్రం నుంచి నిధులు..
ఆలయాల పునర్నిర్మాణానికి ఖర్చయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా పొందడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. `స్వదేశీ దర్శన్` పేరిట కేంద్ర ప్రభుత్వం ఆలయాల జీర్ణోద్ధారణ, ఆధ్మాత్మిక కార్యకలాపాల విస్తరణ, ధార్మిక పనులను కొనసాగించడానికి ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద కేంద్రం నుంచి కొంత ఆర్థిక మొత్తాన్ని గ్రాంటుగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. 900 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని కోరుతూ కొన్ని ప్రతిపాదనలను రూపొందించామని అంటున్నారు.
యధాతథంగా..అదే రూపంతో
కూల్చివేతకు గురైన ఆలయాలన్నింటినీ అవే ప్రదేశంతో పునర్నిర్మించాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. పునర్నిర్మానానికి అవసరమైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ ప్రదేశాలను చూస్తున్నారు. ఇదివరకు ఉన్న ప్రదేశానికి సమీపంలోనే పునర్నిర్మాణాన్ని చేపట్టాలనేది అధికారుల ఆలోచన. దూరంగా తరలించడం వల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. కూల్చివేసిన ప్రదేశంలోనే నిర్మించడానికి తొలి ప్రాధాన్యత ఇస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్థలాభావం ఉన్న చోట.. ప్రత్యామ్నాయం చూస్తామని, అది కూడా లేకపోతే.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని తీసుకోవడానికి భావిస్తున్నామని అంటున్నారు.
జాబితా పెద్దదే..
విజయవాడ నగరం మొత్తానికీ క్షేత్రపాలకుడిగా భక్తులు కొలిచే వీరభద్రస్వామి ఆలయాన్ని సైతం గత ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. నాలుగవ శతాబ్దంలో దీన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయని అంటున్నారు అధికారులు. విజయేశ్వర స్వామి ఆలయానికి వందల సంవత్సరాల చరిత్ర ఉందట. ప్రకాశం బ్యారేజ్ దగ్గర అతి పురాతనమైన, ప్రసిద్ధ పాతాళ వినాయకుని ఆలయం కూల్చివేశారు. ప్రసిద్ధ షిరిడి సాయి ఆలయం, కృష్ణలంక ఆంజనేయ స్వామి ఆలయం, శంకరమఠం నేలమట్టం చేశారు. అప్పట్లో దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.