వైసీపీకి చెక్ ఎలా?: మంత్రులతో బాబు, టిడిపి ప్లాన్ ఇదే, విపక్షాలపై ఇలా..
అమరావతి: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై ఏం చేయాలనే దానిపై ఏప్రిల్ 7వ తేది మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. మరోసారి టిడిపికి చెందిన ప్రజా ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మగౌరవ యాత్ర పేరుతో బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఏం చేయాలనే దానిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతిలో ఉన్న మంత్రులు, టిడిపి ఎమ్మెల్యేలతో సమావేశాన్ని గురువారం సాయంత్రం నిర్వహించారు. ఢిల్లీలోని పరిణామాలను మంత్రులకు చంద్రబాబునాయుడు వివరించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
ఈ సమావేశం వివరాలను ఏపీ మంత్రి కళా వెంకట్రావు గురువారం సాయంత్రం మీడియాకు వివరించారు. ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు టిడిపి, వైసీపీలు వ్యూహ, ప్రతి వ్యూహలు రచిస్తున్నాయి.
ఏప్రిల్7న, అఖిలపక్షం
ఏపీకి ప్రత్యేక హోదా విషయమై ఏం చేయాలనే దానిపై ఏపీకి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో మరోసారి ఏప్రిల్ 7వ తేదిన అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. గతంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి జనసేన, వైసీపీలు హజరుకాలేదు. ఈ దఫా అన్ని పార్టీలను అఖిలపక్ష సమావేశానికి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది.పార్టీలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపుతోంది.
టిడిపి ఎమ్మెల్యేల సైకిల్ ర్యాలీలు
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ టిడిపికి చెందిన ప్రజా ప్రతినిధులు ఏప్రిల్ 6వ తేదిన వెంకటపాలెం నుండి అసెంబ్లీ వరకు సైకిల్ ర్యాలీని నిర్వహించనున్నారు. రాజధాని పరిధిలో సైకిల్ యాత్రను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో టిడిపి కార్యకర్తలు, నేతలు సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఆత్మగౌరవ బస్సుయాత్రకు టిడిపి నిర్ణయం
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో టిడిపి ప్రజా ప్రతినిధులు బస్సుయాత్రను నిర్వహించాలని తలపెట్టారు. ఆత్మగౌరవ యాత్ర పేరుతో ఈ యాత్రను చేపట్టాలని టిడిపి నిర్ణయం తీసుకొంది. అయితే బస్సు యాత్రను ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన తర్వాత ఏం చేయాలనే దానిపై టిడిపి నాయకత్వం చర్చించనుంది.
ప్రతి జిల్లాలో టిడిపి సభలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో టిడిపి చేసిన ఆందోళనలు, బిజెపి ఇచ్చిన హమీలు తదితర విషయాలపై ప్రజలకు వివరించాలని టిడిపి భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టిడిపి బహిరంగ సభలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.