గురుకుల అడ్మిషన్లపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... ఈసారి ఆ పద్దతిలో..
కరోనా వైరస్ నేపథ్యంలో గురుకులాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది గురుకులాల్లో ఐదో తరగతి అడ్మిషన్లకు స్క్రీనింగ్ టెస్టు కాకుండా లాటరీ పద్దతిని అమలుచేయాలని నిర్ణయించింది. ఆరు,ఏడు తరగతుల బ్యాక్ లాగ్ అడ్మిషన్లకు కూడా లాటరీ పద్దతినే అమలుచేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ కోసం జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయి ఎంపిక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో... గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ కింద ప్రస్తుతం 50 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. తాజా నిర్ణయంతో ఈ పాఠశాలలన్నింటిలోనూ లాటరీ పద్దతిలోనే అడ్మిషన్లు ఖరారు చేయనున్నారు.
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు కూడా రద్దు చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో విద్యార్థుల ప్రాణాలను రిస్క్లో పెట్టడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్ సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పరీక్షలు రద్దు చేశారని గుర్తుచేశారు.
అయితే పదో తరగతి పరీక్షలు రద్దు చేసేది లేదని ఇటీవల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరుగుతాయని మంత్రి తెలిపారు. 11 పేపర్ల స్థానంలో 6 పేపర్లకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. అసత్య ప్రచారాలతో విద్యార్థులను గందరగోళానికి గురి చేయవద్దని అన్నారు.