షాకింగ్:ఆ డెసిషన్ కరెక్ట్ కాదు...ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
విజయవాడ:ఆంధ్రప్రదేశ్ లో సిబిఐ విచారణలకు నో చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం నిర్ణయంపై తన స్పందన తెలిపారు.
సీబీఐకి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాను తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసుకునే అధికారం ఆ ప్రభుత్వానికి ఉంటుందని...అయితే అలా ఎందుకు రద్దు చేశారో సహేతుకమైన కారణం చెప్పగలగాలని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అంతేకాదు కేవలం ఒక సంస్థపై ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దని అనడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
ఆ నిర్ణయం...కరెక్ట్ కాదు
ఒక సంస్థపై ఆరోపణలు వస్తే ఆ సంస్థనే దర్యాప్తు చేయవద్దనడం సరికాదని హితవుపలికారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎందుకు తప్పో ఉదాహరణలతో సహా వివరించారు. డాక్టర్ బాగా లేడని హాస్పిటల్ మూసేస్తామా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అవినీతికి పాల్పడే ఉద్యోగులు...కేంద్ర సంస్థల్లో పనిచేసే వారు మరింత రెచ్చిపోతారని లక్ష్మీనారాయణ విశ్లేషించారు.
అవినీతి నిర్మూలనకు...ఆటంకం
ఎపి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా కేసు మొత్తాన్ని తయారు చేసి రాష్ట్రప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా ప్రతి కేసు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాల్సిందేనని, దీనివల్ల అవినీతిని నిర్మూలించే ఉద్యమానికి ఆటంకం ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు. ఒకవైపు సీబీఐ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని లక్ష్మీనారాయణ గుర్తుచేశారు.
రాజకీయ పోరాటం...చేసుకోండి
రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ వ్యవహారంపై అభ్యంతరాలు ఉంటే...అవసరమనుకుంటే రాజకీయ పోరాటం చేసుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. అంతే తప్ప ఇలా సంస్థలను నిర్వీర్యం చేయడం మంచిదికాదని లక్ష్మీనారాయణ హితవుపలికారు. అంతేకాదు ప్రతిపక్ష నేత జగన్పై దాడి కేసులో కోర్టు ఆదేశిస్తే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని తెలిపారు.
కోర్టు తీర్పుకు...వర్తించదు
అయితే సెక్షన్ 6లో ఉన్న నిబంధనలు కోర్టు ఉత్తర్వులకు వర్తించవనే విషయాన్ని గమనించాలని లక్ష్మీనారాయణ అన్నారు. కర్ణాటక మైనింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే ఇలాంటి ఉత్తర్వులే ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కర్ణాటక ప్రభుత్వం తొలుత సాధారణ అనుమతిని రద్దు చేసింది...మళ్లీ సిబిఐ విచారణకు తిరిగి అనుమతి ఇచ్చిందని లక్ష్మీనారాయణ వెల్లడించారు.