కరోనాను సమర్దంగా అడ్డుకున్నాం- చంద్రబాబు హైద్రాబాద్లో దాక్కున్నారు- ఏపీ సర్కార్
ఏపీలో కరోనా నియంత్రణపై ఇవాళ అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని సభలో ఏకరువు పెట్టారు. దేశంలోనే అత్యధిక స్ధాయిలో కరోనా పరీక్షల నిర్వహణతో పాటు ఎక్కడికక్కడ వైరస్ను అడ్డుకున్న తీరును సభ దృష్టికి తెచ్చారు. భారీగా నిర్వహించిన పరీక్షల వల్ల రాష్ట్రంలో కరోనాకు అడ్డుకట్ట వేయగలిగామని ఆళ్లనాని తెలిపారు.
రాష్టంలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ఆశా కార్యకర్తలు, ఇతర హెల్త్ వర్కర్ల సాయంతో ఇంటింటి సర్వే నిర్వహించిందని ఆళ్లనాని గుర్తుచేశారు. కేంద్రం, ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్వో మార్దదర్శకాలను పూర్తిగా పాటించామని, లాక్డౌన్తో పాటు ఇతర చర్యలు కూడా కఠినంగా అమలు చేశామన్నారు. దీనివల్ల ప్రస్తుతం కరోనా అదుపులోకి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం తీసుకున్న చర్యలను ప్రధాని మోడీతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రశంసించారని ఆళ్లనాని గుర్తుచేశారు.
కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో విపక్ష నేత చంద్రబాబు మాత్రం హైదరాబాద్ నివాసానికి పరిమితం అయ్యారని ఆళ్లనాని ఆక్షేపించారు. ప్రభుత్వం చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలకు విపక్షాలు మద్దతు ఇవ్వలేదన్నారు. దీనికి ప్రజలు వారికి బుద్ధి చెప్తారని ఆళ్లనాని తెలిపారు. కరోనా సమయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రశంసించకపోగా.. చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ హైదరాబాద్ నుంచే విమర్శలు చేశారన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు భారీగా లబ్ది చేకూరేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆళ్లనాని తెలిపారు. కరోనాను సైతం ఆరోగ్య శ్రీ పథకంలో చేర్చామని, ఈ పథకం ద్వారా చికిత్స చేసే మొత్తం వ్యాధుల సంఖ్యను కూడా 2 వేలకు పైగా పెంచి అమలు చేస్తున్నామన్నారు. గతంలో జనం మర్చిపోయిన 104, 108 వాహనాలను తిరిగి అందుబాటులోకి తెచ్చామని ఆళ్లనాని తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లో సైతం చికిత్స చేయించుకునే సదుపాయం కల్పించామని ఆయన గుర్తుచేశారు.