పోలవరం సాంకేతిక సలహాదారుపై వేటు వేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం .. కారణం ఇదే
సంచలనాలకు కేరాఫ్ అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి పని చెయ్యని అధికారులపై వేటు వెయ్యటానికి ఏ మాత్రం వెనకాడటం లేదు . ఈ క్రమంలో ఏపీ సర్కార్ పోలవరం ప్రాజెక్టు సాంకేతిక సలహాదారు హెచ్.కె. సాహుని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది . హెచ్.కే సాహుని తొలగిస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
2018 ఏప్రిల్ లో అప్పటి టీడీపీ ప్రభుత్వం హెచ్. కే సాహుకు నెలకు రెండు లక్షల రూపాయల వేతనంతో నియమించింది. ఈయన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సాంకేతిక సలహాదరుగా అప్పటి నుండి వ్యవహరిస్తున్నారు . హైదరాబాద్లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలో ప్రాజెక్టుకు అవసరమైన సాంకేతిక, న్యాయ సలహాల కోసం ఈయనను అప్పట్లో నియమించారు. కానీ ఆయన సేవలు సంతృప్తికరంగా లేవని ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక అందించడంతో ఏపీ ప్రభుత్వం ఈ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను 2021 నాటికి పూర్తి చేయాల్సిందేనని ఇప్పటికే తేల్చి చెప్పిన సీఎం జగన్ జల వనరుల శాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు.
ఒకపక్క కరోనా లాక్ డౌన్ సమయంలో ఆగిన పోలవరం నిర్మాణ పనులు, ఇప్పుడిప్పుడే మళ్ళీ లాక్ డౌన్ సడలింపుల నేపధ్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పుడు పనులు ఆగటానికి వీల్లేదని, సిమెంట్ , స్టీల్ కొరత లేకుండా చూడాలని చెప్పారు.కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు వరదలు వచ్చేలోగా అంటే జూలైలోగా పునరావాసం కల్పించాలని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.