శ్రీశైలం ఇంచార్జ్ ఎస్ఈని తొలగించిన ప్రభుత్వం ..భార్యతో గేట్లు ఎత్తించిన ఘటనే కారణం
శ్రీశైలం డ్యాం కు వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం డ్యాం గేట్లను పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు .అయితే శ్రీశైలం డ్యామ్ ఇంచార్జ్ సూపరిండెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్న శ్రీనివాస రెడ్డి శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తిన వివాదంలో చిక్కుకున్నారు. ఇక ఆయనపై చర్యల్లో భాగంగా వేటు పడింది.
అసలు ఇంతకీ శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తితే తప్పేంటి అంటారా.. డ్యాం గేట్లు ఎత్తే విషయంలో అధికారి చేసింది అక్షరాలా తప్పే . అధికారి హోదాలో ఉండి భార్య తో శ్రీశైలం డ్యాం గేట్లను ఎత్తించారు శ్రీనివాస రెడ్డి. ఇక ఇది పలు విమర్శలకు కారణమైంది. తన ఇంటి కార్యక్రమం లాగా, సొంత పని లాగా భార్యతో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తించి అత్యుత్సాహం ప్రదర్శించారు ఇన్చార్జి సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి. అందుకు ఫలితంగా విమర్శలు ఎదుర్కోవటమే కాకుండా ,ఆయనను తొలగిస్తూ జలవనరులశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయన స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో నీరు, ప్రగతి విభాగం ఎస్ఈగా పనిచేస్తున్న ఎస్.చంద్రశేఖర్రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. నిబంధనలకు వ్యతిరేకంగా అంత పెద్ద హోదాలో ఉండి భార్యతో గేట్లను ఎత్తించటమే ఆ అధికారి చేసిన పెద్ద తప్పు. భార్య మీద ప్రేమ ఉండొచ్చు కానీ, అది తన ఉద్యోగానికి ఎసరు పెట్టేలా చేసుకోకూడదనేది ప్రభుత్వం తాజాగా తీసుకున్న చర్య పైన పలువురు ఇంజనీర్ల జరుగుతున్న చర్చ.