ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు జీవో పై ప్రభుత్వం క్లారిటీ..!!
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు పై ప్రచారంలోకి వచ్చిన నకిలీ జీవో పాత్రధారులపై ప్రభుత్వం చర్యలకు సిద్దం అవుతోంది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం 62 సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచారంటూ ఒక జీవో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీంతో..ఉద్యోగుల్లో దీని పైన సందేహాలు నెలకొన్నాయి. దీంతో..వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఈ జీవో ప్రభుత్వం జారీ చేసిన జీవో కాదని ప్రభుత్వం..ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. ఇది ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ జీవో పేరుతో నకిలీ జీవోను తయారు చేసారు.
గతంలో ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన జీవోలోనే మార్పులు చేసి ప్రభుత్వ తాజా జీవోగా ప్రచారంలో పెట్టారు. దీని పైన ఏపీ ప్రభుత్వ ఆర్దిక శాఖ సీరియస్ అయింది. ప్రభుత్వ జీవోలను నకిలీవి ప్రచారంలోకి తీసుకురావటం పైన నేరుగా గుంటూరు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేసింది.
దీని పై వెంటనే విచారణ ప్రారంభించాలని డీఐజీ గుంటూరు ఎస్పీని ఆదేశించారు. అసలు ఈ జీవో ఎక్కడ నుంచి సర్క్యులేట్ అవ్వటం ప్రారంభమైంది..ఎవరు తయారు చేసారనే కోణంలో విచారణ ప్రారంభం అయింది. ప్రభుత్వం ఈ నిర్ణయం పైన క్లారిటీ ఇవ్వటంతో ఉద్యోగ సంఘాలు తమ సభ్యులకు సందేశాలు పంపాయి.
ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచుతూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న జీవోను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసారు. ఈ ఫేక్ జీవోతో ఉద్యోగుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉండటంతో పాటుగా ప్రభుత్వ వ్యవహారాలను ఇలా నకిలీ జీవోలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పైన కఠిన చర్యలను ప్రభుత్వం సిద్దం అవుతోంది.
ఈ జీవో వ్యవహారం పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం జరగలేదని..ఏ జీవో ఇవ్వలేదని వెల్లడించింది. ఈ నకిలీ జీవో వెనుక రాజకీయ అజెండా ఏమైనా ఉందా..అసలు ఈ జీవో తయారీ వెనుక ఉన్నదెవరనే అంశం పైన పోలీసులు విచారణ ప్రారంభించారు. కఠిన చర్యలకు నిర్ణయించారు.