తరలింపు చిచ్చు: ఏపీ ఉద్యోగుల కుటుంబాల చీలిక, స్పష్టత ఏది?
విజయవాడ: విభజన తర్వాత రెండు తెలుగు రాష్ల్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. అవి కూడా రెండేళ్లు పూర్తి చేసుకున్నాయి. అంతా సక్రమంగానే ఉన్నా.. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీర్ఘకాలంగా హైదరాబాద్లో ఉండి స్థిర నివాసాలు ఏర్పరచుకున్నవారు.. ఒక్కసారిగా పిల్లలు, కుటుంబాన్ని వదిలేసి విధుల నిమిత్తం ఏపీ రాజధాని అమరావతి వెళ్లాలంటే ఇష్టపడటం లేదు.
అయితే, రాజధాని ఎక్కడ ఏర్పడితే అక్కడికి తరలి వెళ్లిపోవాలన్న విషయం ఉద్యోగులకు తెలియంది కాదు. ఇందుకు చాలామంది ఉద్యోగులు మానసికంగా సిద్ధపడ్డారు కూడా. కాకపోతే దాని తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తరలింపు వ్యవహారం కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితిని తీసుకొస్తోందని వారు భావిస్తున్నారు.
అంతేగాక, అధికారుల మధ్య సమన్వం లేకపోవడం, ఎంసెట్ కౌన్సిలింగ్ మొదలైనా స్థానికత అంశం తేలకపోవడంతో తరలిరావల్సిన ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో పనిచేస్తున్న ప్రభుత్వోద్యోగుల్లో భర్తలవి సర్కారు కొలువులైతే, భార్యలు, వారి పిల్లలు ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్నారు. భార్యది ప్రభుత్వోద్యోగమైతే, భర్త ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న కుటుంబాలూ ఉన్నాయి. మరికొందరు స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నారు.
తెలంగాణలోని స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న వారిలో భార్య, భర్తల్లో ఎవరైనా అక్కడే ప్రభుత్వోద్యోగం చేస్తుంటే, వారిద్దరినీ తెలంగాణలోనే కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, ఏపీకి తరలివచ్చే ఉద్యోగులకు ఆ సౌకర్యం లేకుండా పోయింది.
ఉదాహరణకు భర్త ఏపీ సెక్రటేరియట్ లేదా డైరక్టరేట్ లేదా కమిషనరేట్లో పని చేస్తున్నారని అనుకుంటే.. ఆయన భార్య ప్రైవేటు సంస్థలో పనిచేస్తుంటే, పిల్లలు తెలంగాణ ప్రభుత్వంలోని కమిషనరేట్, డైరక్టరేట్లలో అసిస్టెంటెంట్ సెక్షన్ ఆఫీసర్లుగా పని చేస్తున్నారు. ఇప్పుడు భర్త రాజధాని అమరావతికి రావల్సి ఉంది. దీంతో భార్య కూడా ఆమె ఉద్యోగాన్ని వదులుకుని భర్తవెంట వెళ్లాల్సి వస్తోంది.
అయితే వారి పిల్లల విషయం మాత్రం సందిగ్ధంలోపడింది. దీనిపై ఇరు ప్రభుత్వాల నుంచి సమాధానం రావాల్సి ఉంది. తామంతా హైదరాబాద్లోనే సెటిలవుతామన్న ఉద్దేశంతో భార్యా భర్తలు ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చారు. ఈ తరలింపు వలన ఎవరో ఒకరు ఉద్యోగం వదులుకోక తప్పదు. ఒకవేళ వీరిలో ఏ ఒక్కరైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలో హైదరాబాద్లో పనిచేస్తే, ఇద్దరూ వేర్వేరుగా జీవనాన్ని సాగించక తప్పేలా లేదు.
అంతేగాక, స్థానికత అంశంపై ఉద్యోగుల్లో నెలకొన్న భయాందోళనలు పోగొట్టేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినినిపిస్తున్నాయి. స్థానితకపై ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడం లేదో అర్థంకావడం లేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. కాగా, తండ్రి స్థానికతకు సంబంధించి విభజన చట్టంలోని సెక్షన్ 371 (డి)లో చిన్నపాటి చేర్పులు చేస్తే సరిపోతుంది.
దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సవరణలను కేంద్రానికి పంపించింది. దానిపై కేంద్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసింది. వాటిపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చి తిరిగి కేంద్రానికి పంపించింది. ఈ ప్రక్రియ పూరై రెండు నెలలైంది. అయినా కేంద్రం స్పందించకపోవడం పట్ల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఇప్పటికే ఎంసెట్ కౌన్సిలింగ్ ఆరంభమైంది. ఉద్యోగులు ఏపీకి తరలి వచ్చాక స్థానికతపై స్పష్టత వచ్చినా ప్రయోజనం ఉండదని ఉద్యోగ సంఘ నేతలు అంటున్నారు. ప్రస్తుతం సంకట పరిస్థితుల్లో తమ పిల్లలు ఎక్కడ లోకల్ అవుతారు? ఎక్కడ నాన్ లోకల్ అవుతారన్న విషయం తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల పిల్లలు కూడా ఇదే అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. తమ పిల్లల భవిష్యత్తో ప్రభుత్వాలు చెలగాటం ఆడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా రోడ్ మ్యాప్ ఇవ్వకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు, పాలకులకు మధ్య సమన్వయం లేకపోవడం వలన తరలింపు ప్రక్రియ మరింత జటిలంగా మారుతోంది.
'తాత్కాలిక సెక్రటేరియట్లో జి ప్లస్ త్రి అంతస్తులు నిర్మిస్తామన్నారు. జూన్ 15నాటికి ఉద్యోగులు తరలి రావాలన్నారు. ఇప్పుడు తాత్కాలిక సెక్రటేరియట్లో అంతస్తులను కుదించారు. హెచ్ఓడిలను ప్రైవేటు భవనాలు వెతుక్కోమన్నారు. అలాగే ఏ శాఖ ఎప్పుడు తరిలివెళ్లాలి? సెక్రటేరియట్ ఉద్యోగులు ఎప్పుడు వెళ్లాలి తదితర అంశాల మీద ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వలేదు' అని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్యోగుల ఆందోళనకు ఇదే ప్రధాన కారణమని ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెబుతున్నారు. ఉద్యోగులు, ఉన్నతాధికారులు, పాలకుల మధ్య సమన్వయ లోపం కూడా ఇందుకు కారణమని అంటున్నారు. సీఎంతోపాటు మంత్రులు.. ఉద్యోగులకు కావాల్సిన భవనాలను, తదితర సౌకర్యాలను కల్పించినట్లయితే ఈపాటికి హెచ్ఓడీలన్నీ అక్కడికి వచ్చేవని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సమన్వయంతో ఉద్యోగుల తరలింపు సమస్యను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కోరుతున్నారు.