ఈనెల 27న భారత్ బంద్ కు వైసీపీ సర్కార్ మద్దతు-పేర్నినాని కీలక వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో ఈ నెల 27న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో టీడీపీ ఈ బంద్ కు మద్దతు ప్రకటించగా.. తాజాగా వైసీపీ కూడా అదే బాట పట్టింది.
ఈ నెల 27న రైతు సంఘాల పిలుపుమేరకు జరుగుతున్న భారత్ బంద్ కు మద్దతివ్వాలని నిర్ణయించినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సమాచారశాఖ మంత్రి పేర్నినాని ఓ ప్రకటన చేశారు. ఈనెల 27న భారత్ బంద్ కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందన్నారు. కొద్ది మాసాలుగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని అనేక రైతు సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయని మంత్రి గుర్తు చేశారు. గతంలో చేసిన చట్టాల రద్దు కొరకు రైతు సంఘాలు ఈనెల 27 నబంద్ కు పిలుపునిచ్చాయని మంత్రి తెలిపారు.
మరోవైపు విశాఖ ఉక్కును కార్పొరేట్ వ్యక్తులకు అమ్మవద్దని అదే రోజు కార్మిక సంఘాలు చేపడుతున్న భారత్ బంద్ కు సైతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్దత్తు ఇస్తుందని వైసీపీ మంత్రి పేర్నినాని తెలిపారు. బంద్ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులు తిప్పకూడదని నిర్ణయించినట్లు నాని వెల్లడించారు. రైతులతో పాటు విశాఖ ఉక్కుకు సంబంధించి పోరాటం చేస్తున్న వారంతా శాంతియుతంగా బంద్ నిర్వహించాలని మంత్రి కోరారు. మధ్యాహ్నం 1 గంట తర్వాత బస్సులు యధావిధిగా తిరుగుతాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటికరణ చేయొద్దని, 3 రైతు చట్టాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కోరుతున్నట్లు మంత్రి పేర్నినాని వెల్లడించారు.
గతంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల్ని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ అండగా నిలిచింది. అంతే కాదు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ వంటి వారిని సైతం ఏపీ సీఎం జగన్ తప్పుబట్టారు. ఇప్పుడు రైతులు అదే అంశంపై చేపడుతున్న భారత్ బంద్ కు మాత్రం వైసీపీ మద్దతివ్వాలని నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలోనూ వైసీపీ నేరుగా పాల్గొనడం లేదు. కానీ ఇప్పుడు దీనిపైనా అదే రోజు నిర్వహిస్తున్న భారత్ బంద్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.
ఈనెల 27న భారత్ బంద్ కు వైసీపీ సర్కార్ మద్దతు-పేర్నినాని కీలక వ్యాఖ్యలు#andhrapradesh, #bharatbandh, #ysrcp, #ysrcpgovt, #perninani pic.twitter.com/0du45Er8OH
— oneindiatelugu (@oneindiatelugu) September 25, 2021